సిటీబ్యూరో, జూన్ 25 (నసమ్తే తెలంగాణ): దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని పురపాలక శాఖ కార్యదర్శి,హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ అర్వింద్కుమార్ అన్నారు. శుక్రవారం ఫైనాన్షియల్ డ్రిస్టిక్లోని ఐసీఐసీఐ టవర్స్లో జరిగిన కోకాపేట ఈ -ఆక్షన్ ఫ్రీబిడ్ సమావేశానికి హాజరైన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, డెవలపర్స్లను ఉద్దేశించి అర్వింద్కుమార్ మాట్లాడారు. మల్టీ యూజ్ జోన్గా కోకాపేట హెచ్ఎండీఏ లేఅవుట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా దేశానికి రోల్ మోడల్గా నిలుస్తున్నదన్నారు. ఇప్పటికే కోకాపేట ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ముద్ర పడిందన్నారు. భవిష్యత్ విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం 5.3 ఎకరాల్లో 400/220/132/33 కేవీ సామర్థ్యం కలిగిన సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుందన్నారు. జలమండలి సంస్థ నిర్మించే పంప్ హౌస్ నిర్మాణానికి 9.30ఎకరాలు కేటాయించామన్నారు. ఓఆర్ఆర్ నుంచి కోకాపేట లేఅవుట్లోకి చేరుకునేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కోకాపేట లేఅవుట్లో నిర్మాణాలకు టీఎస్ బీపాస్ ద్వారా 21రోజుల్లో అనుమతులు లభిస్తాయని, అక్కడి నిర్మాణాలకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) పరిమితి ఉండదని అర్వింద్కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు డెవలపర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.