బీబీనగర్/ఘట్కేసర్, మే 10 : కరోనా కట్టడికి దేశ ప్రజల సహాయ సహకారాలు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలో గల ఎయిమ్స్ దవాఖానతో పాటు, మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో నిర్వహిస్తున్న కొవిడ్ ఐసొలేషన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ, పీఎం కేర్స్ ద్వారా 50 ఆక్సిజన్ సిలిండర్లను కొవిడ్ చికిత్స నిమిత్తం ఎయిమ్స్కు అందించినట్టు తెలిపారు. త్వరలో కొవిడ్ ఐసొలేషన్ వార్డును 50 పడకల నుండి 200 పడకలకు పెంచడంతోపాటు… పూర్తిస్ధాయి వైద్యసేవలు అందించడానికి 50 వెంటిలేటర్లను కూడా అందిస్తామని చెప్పారు.
ఎయిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం 50, రెండవ సంవత్సరం 62 మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారని, మూడవ సంవత్సరం ఈ సంఖ్యను 100-150 సీట్లకు పెంచనున్నట్టు చెప్పారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడానికి అప్రూవల్ వచ్చిందన్నారు. ఎయిమ్స్ దవాఖానలో ఆక్సిజన్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, కల్నల్ అనంతరావు, పివి శ్యాంసుందర్, గూడూరు నారాయణ రెడ్డి, వైద్య సిబ్బంది, సూపరింటెండెంట్ కళ్యాణి పాల్గొన్నారు. పోచారంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వెంట ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ, రాష్టీయ సేవా ప్రముఖ్ ఎక్కా శేఖర్ జీ, సేవా భారతి ప్రాంత కార్యదర్శి రామ్మూర్తి, ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ వాసు, ఐసొలేషన్ సెంటర్ ఇన్చార్జి బలవంతరెడ్డి ఉన్నారు.