రైతులు పండించిన పంటలను మద్దతు ధర కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయడంలో భారతీయ రైల్వే దృష్టి సారించింది. ఇప్పటివరకు 149 కిసాన్ రైళ్లను ప్రారంభించిన భారతీయ రైల్వే సోమవారం 150వ కిసాన్ రైలు ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో నాగర్సోల్ నుంచి తొలుత ఐదు రైళ్లు ప్రారంభించగా, కేవలం 126 రోజుల స్వల్ప వ్యవధిలోనే 150 కిసాన్ రైలును ప్రారంభించి భారతీయ రైల్వే రైతులకు మరింత చేరువైంది. ఈ 150వ కిసాన్ రైలులో 246 టన్నుల ఉల్లిగడ్డలను నాగర్సోల్ నుంచి పశ్చిమబెంగాల్లోని మాల్దా పట్టణానికి రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కిసాన్ రైళ్ల ద్వారా ఉల్లిగడ్డలు, పుచ్చకాయలు, ద్రాక్ష రవాణా చేశారు. కిసాన్ రైలు ద్వారా సరుకు రవాణాకు 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నాందేడ్ రైల్వే డివిజన్ పరిధిలో 150వ రైలును ప్రారంభించిన అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు.