బేగంపేట్ జూలై 28: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచంతో పోటీ పడుతున్నదని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ. డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. బుధవారం ప్రపంచ హెపటైటిస్ డేను సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణ ఎల్లా ముఖ్య అతిథిగా హాజరై కిమ్స్ దవాఖాన చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య, ఎండీ భాస్కర్రావు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. గతంలో ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ పూర్తి కావాలంటే ఏండ్ల తరబడి సమయం పట్టేదని, నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా ట్రయల్ రన్ చేయగలుగుతున్నామన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ను తక్కువ కాలంలోనే విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసి కోట్లాది మంది ప్రాణాలను కాపాడగులగుతున్నామన్నారు. అనంతరం డాక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ…మానవాళి మనుగడకే పెను ముప్పుగా పరిణమించిన కొవిడ్-19ను ఎదుర్కోవడంలో కొంత వరకు విజయం సాధించామన్నారు.ఈ క్రమంలో డాక్టర్ కృష్ణ ఎల్లాతో కొవిడ్పై ఉన్న అనుమానాలను పలువురు డాక్టర్లు నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కొవిడ్ సమయంలో ముందుండి సేవలందించిన 300మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని మెమోంటోలతో ఘనంగా సత్కరించారు.