హైదరాబాద్ : రెండు వేర్వేరు బ్లడ్ గ్రూప్లు కలిగిన వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. ఇది అవయవ అనుకూలత ఆందోళనను పరిష్కరించే సామర్థ్యంగా, అనేక మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.
అసోం నివాసి అషిమ్ దాస్(40)కు తన భార్య నుండి వైద్యులు లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేశారు. అయితే అషీమ్ దాస్ బ్లడ్ గ్రూప్ ‘బి పాజిటివ్’ కాగా అతని భార్య బ్లడ్ గ్రూప్ ‘ఎ పాజిటివ్’. వేర్వేరు రక్త గ్రూప్ల మధ్య అవయవ మార్పిడి చాలా సంక్లిష్టమైనది. ఎందుకంటే దాత అవయవాన్ని తిరస్కరించే ప్రతిరోధకాలు పూర్తిగా తొలగించబడాలి లేదా మార్పిడికి ముందు నిద్రాణమై అయినా ఉండాలి. ప్లాస్మాఫెరెసిస్ అనే ప్రక్రియ ద్వారా ప్రతిరోధకాలను తటస్తం చేయడానికి మందులు ఇస్తూ రోగిలో ప్రతిరోధకాలను క్రమంగా తగ్గించగలిగినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ప్రక్రియకు దాదాపు రెండు వారాల సమయం పట్టిందని కిమ్స్ హాస్పిటల్స్ నెఫ్రోలాజిస్ట్, శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యుడు డాక్టర్ రవి చెప్పారు. కిమ్స్లో చీఫ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ సర్బేశ్వర్ సహారాయ్య ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేశారు. రోగులు శస్త్రచికిత్స నుండి కోలుకుని ఎటువంటి సమస్యలు లేకుండా డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు.