బేగంపేట్ సెప్టెంబర్ 28: ప్రియుడి కోసం భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ఓ మహిళ తన భర్తనే కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన మంగళవారం సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మెహిదీపట్నంకు చెందిన అప్షియా బేగం, మౌలాలికి చెందిన షేక్ వాజీద్ వివాహం 2012లో జరిగింది. వాజీద్ మోండా మార్కెట్లోని ఓ చెప్పుల దుకాణంలో పనిచేస్తున్నాడు. అప్షియా బేగం గృహిణి. వీరికి ముగ్గురు సంతానం. ఇదిలాఉండగా, అప్షియా బేగంకు సామాజిక మాద్యమాల ద్వారా ముషీరాబాద్కు చెందిన ఆసిఫ్తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేత సంబంధం ఏర్పడింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న అప్షియాబేగం విడాకులు ఇవ్వాలని భర్త వాజీద్ను కోరింది. పిల్లలు ఉన్నారంటూ అతడు అంగీకరించలేదు. తన భర్త నుంచి ఎలాగైనా విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్న ఆమె సోమవారం రాత్రి ప్రియుడు ఆసిఫ్తోపాటు మరో నలుగురి స్నేహితులతో కలిసి వాజీద్ను కిడ్నాప్ చేయించి, ముషీరాబాద్కు తీసుకువెళ్లింది. వారంతా కలిసి బలవంతంగా షేక్ వాజీద్తో విడాకుల పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. దుకాణం యజమాని సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్షియాబేగంతో పాటు కిడ్నాప్నకు సహకరించిన ఇమ్రాన్, జాఫర్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.