వెంగళరావునగర్, సెప్టెంబర్ 24: అమీర్పేటలోని ధరకరం రోడ్డులో జరిగిన వృద్ధురాళ్ల కిడ్నాప్ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి గుల్బార్గాలో తలదాచుకున్నట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు. ధరకరం రోడ్డులో ఉంటున్న అక్కాచెల్లెళ్లు అస్మత్ ఉన్నీసాబేగం(73), మహమ్మదీ ఉన్నీసాబేగం (70)లు గురువారం ఉదయం కిడ్నాప్నకు గురైన విషయం తెలిసిందే. నిందితులు వారిద్దరిని అమీన్పూర్కు తీసుకెళ్లి బంధించారు. స్థానికుల సాయంతో బయటపడిన ఈ ఇద్దరు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఆర్నగర్ పోలీసులు బాధితురాళ్ల నుంచి ఉదంతానికి సంబంధించిన వివరాలు సేకరించి.. నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మూలాలపై ఆరా తీస్తున్నారు. మీరాజ్ అహ్మద్ ఖురేషీ అనే వ్యక్తితో పాటు మరో నలుగురిపై కిడ్నాప్, దాడి కేసులను నమోదు చేశారు. నిందితులు పట్టుపడితే అపహరణకు గల కారణాలు తెలుస్తాయని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.