బంజారాహిల్స్, జూలై 5: నేలపైనే కాక బండరాళ్లపైనా మొక్కలు పెంచేందుకు కేబీఆర్ నేషనల్ పార్కులో అటవీశాఖ అధికారులు వినూత్న ప్రయోగానికి తెరతీశారు. బండరాళ్ల మీద మట్టిపోసి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడో విడత హరితహారంలో భాగంగా కేబీఆర్ పార్కులో ప్రయోగాత్మకంగా రాక్ ప్లాంటేషన్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలోని కేబీఆర్ పార్కులో ఆరు చోట్ల షీట్ రాక్స్గా పిలువబడే బండరాళ్లు ఉన్నాయి. వీటి మీద చిన్న చిన్న రాళ్లు పేర్చి మధ్యలో మట్టి పోసి మొక్కలు నాటనున్నారు. ఈ విధానంలో సుమారు 5 నుంచి 10 వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాళ్ల పగుళ్లలోకి చొచ్చుకుపోయే గుణం ఉండే రావి, జువ్వి, మర్రిని రాక్ ప్లాంటేషన్ విధానంలో నాటనున్నామని డీఎఫ్వో జోజి తెలిపారు. రెండేండ్ల క్రితం పార్కులోని మొత్తం స్థలంలో డ్రమ్ ప్లాంటేషన్ విధానంలో మొక్కలు నాటామని.. ప్రస్తుతం అవి ఏపుగా పెరుగుతున్నాయని వివరించారు. రాక్ ప్లాంటేషన్ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు అంటున్నారు.