అర్ధరాత్రి సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ ఆస్పత్రికి తరలింపు
కంటోన్మెంట్, ఆగస్టు 17: పోలీసులు కరుణలో కూడా తమకు తామే చాటి అని నిరూపించుకున్నారు. ఓ గర్భిణికి అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో కార్ఖానా పీఎస్ బ్లూ కోట్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. సిఖ్ విలేజ్ శ్రీరామ్నగర్ బస్తీకి చెందిన బబితకు ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నొప్పులు రావడంతో కుటుంబీకులు కార్ఖానా సీఐ రవీందర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సీఐ వెంటనే బ్లూకోట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్లూ కోట్ సిబ్బంది సతీశ్, రమేశ్ హుటాహుటిన బబితను ఆటోలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం బబిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో తల్లీ కూతురు క్షేమంగా ఉన్నారు. వెంటనే స్పందించిన పోలీసులకు బబిత కుటుంబసభ్యులు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. బ్లూకోట్ సిబ్బందిని సీఐ రవీందర్ అభినందించారు.