కరీంనగర్ దవాఖానలో రోజుకు 400 ఆర్టీపీసీఆర్ టెస్టులు
పెరిగిన శాంపిళ్ల సేకరణ
నిర్విరామంగా సిబ్బంది విధులు
వేగంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు
24గంటల్లోనే ఫలితం.. ఫోన్కే రిపోర్ట్
రిజల్ట్ కచ్చితం.. కరోనా నియంత్రణ సులభం
విద్యానగర్, జూన్ 3:కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్ష ‘ఈజీగా.. ఫాస్ట్గా’ అవుతున్నది. ఇక్కడి ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో మొన్నటిదాకా రోజుకు 200 పరీక్షలే చేసినా, మిషన్ అప్డేట్ కావడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 400కు చేరింది. హుజూరాబాద్, జమ్మికుంటతోపాటు కరీంనగర్ దవాఖానల నుంచి సేకరించిన శాంపిళ్లకు టెస్టులు చేస్తుండగా, 24గంటల్లోనే ఫలితం వస్తున్నది. కరోనా చికిత్సకు ఈ సమయం ఎంతో కీలకంగా మారుతుండగా, బాధితుల ప్రాణాలకు భరోసా దక్కుతున్నది.
కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చారు. ఏప్రిల్ 23న దీనిని ప్రారంభించారు. హుజూరాబాద్, జమ్మికుంట దవాఖానలతోపాటు కరీంనగర్ వైద్యశాలలో బాధితుల నుంచి సేకరించిన శాంపిళ్లకు ఇక్కడే పరీక్షలు చేస్తున్నారు. ప్రారంభంలో 186 టెస్టులు చేసినా, తర్వాత 200 వరకు చేశారు. తర్వాత మిషన్ను అప్డేట్ చేసి ఈ నెల 19వ తేదీ నుంచి రోజుకు 400 టెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 7,248 వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు.
24 గంటల్లోనే రిపోర్ట్..
గతంలో జిల్లాలో చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు వరంగల్, హైదరాబాద్కు పంపించేవారు. ఫలితాల కోసం నాలుగు నుంచి ఆరు రోజుల వరకు వేచి చూడాల్సి వచ్చేది. ఇక ప్రైవేట్ ల్యాబ్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయిస్తే 800 నుంచి 1500 దాకా వసూలు చేస్తున్నారు. అక్కడా ఫలితాల కోసం మూడు లేదా నాలుగు రోజులు ఆగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఇటీవలే కరీంనగర్ పెద్ద దవాఖాన ఆవరణలో కోటి వెచ్చించి ల్యాబ్ను నెలకొల్పింది. ఎనిమిది మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ముగ్గురు సైంటిస్ట్లు, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, నోడల్ ఆఫీసర్ను నియమించింది. సిబ్బంది రోజంతా పని చేస్తుండడంతో శాంపిల్ తీసుకున్న 24 గంటల్లోనే రిపోర్ట్ను నేరుగా మొబైల్కే పంపిస్తున్నారు. ఫలితాలు త్వరగా రావడంతో వ్యాధి ముదరకముందే త్వరగా చికిత్స తీసుకునే వీలు కలుగుతున్నది. నివారణలోనూ కీలకంగా మారుతున్నది.
ఫలితాలు 24 గంటల్లోనే..
సెంటర్లో మేం రోజంతా పని చేస్తున్నాం. ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలు 24 గంటల్లోనే అందిస్తున్నాం. మొన్నటిదాకా రోజుకు 200 పరీక్షల దాకా చేశాం. ఆటోమేటెడ్ మిషన్తో రోజుకు 400 పరీక్షల పైనే చేస్తున్నాం. ప్రైవేట్ దవాఖానల్లో చేసిన పరీక్షల కంటే ప్రభుత్వ దవాఖానలో చేసిన పరీక్షల ఫలితాలు కచ్చితంగా ఉంటాయి.
నిర్భయంగా పనిచేస్తున్నాం..
కొవిడ్ నేపథ్యంలో రోగులంతా ప్రభుత్వ దవాఖానకే వస్తున్నారు. దీంతో మాపై పనిభారం పెరుగుతున్నది. రోజు వందలాది మంది అనుమానితుల వద్ద రక్త నమూనాలతో పాటు స్వాబ్ను సేకరిస్తున్నాం. ఏ కొంచెం నిర్లక్ష్యం చేసినా ప్రాణానికే ప్రమాదం ఉంది. ల్యాబ్లో 80 శాతం మందికి పైగా పాజిటివ్కు గురయ్యారు. అయినా నిర్భయంగా పని చేస్తున్నాం. పీపీఈ కిట్లు వేసుకుని స్వాబ్ను సేకరిస్తున్నాం.