అంబర్పేట : నాణ్యతలో లోపం లేకుండా డ్రైనేజీ పైపులైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్లోని అయ్యప్పగుడి వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ పనులను శనివారం వివిధ విభాగాల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం పాత పైపులైన్లను తొలిగించి వాటి స్థానంలో కొత్త పైపులైన్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. బాగ్అంబర్పేట డివిజన్లోని అయ్యప్పగుడి వద్ద రూ.40లక్షలతో ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ పనుల వల్ల ఇక్కడి ప్రాంత ప్రజల డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. స్థానికులకు ఇబ్బంది కలుగకుండా సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. జలమండలి జీఎం మహేశ్, డీజీఎం సతీశ్, ఏఈ కుశాల్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, లక్ష్మణ్, జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి పాల్గొన్నారు.