చార్మినార్, జూన్ 9: చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో ఓ కుటుంబం తల్లడిల్లింది. చికిత్స కోసం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో భిక్షాటన శరణ్యమైంది. భిక్షాటనతో డబ్బులు పోగు చేసుకుని చికిత్స చేయించాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. కనిపించిన ప్రతి ఒక్కరి ముందు చేయి చాస్తూ తోచినంత సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను గుర్తించిన ఓ కానిస్టేబుల్ హృదయం స్పందించింది. చిన్నారి తల్లిడంద్రుల వద్దకు చేరి విషయాన్ని ఆరా తీశాడు. చిన్నారి చికిత్స కోసం ఎదుర్కొంటున్న సమస్యలను కానిస్టేబుల్కు వివరించారు.
వెంటనే స్పందించిన కాలాపత్తర్ పోలీస్స్టేషన్ (పీసీ 5562) కానిస్టేబుల్ మురళీధర్ నేనున్నానంటూ.. ధైర్యాన్నిచ్చాడు. అప్పటికే, చిన్నారి ఒళ్లు నిప్పులా కాలుతున్నట్లు గుర్తించిన మురళీధర్ వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. చికిత్స అనంతరం, చిన్నారికి అవరసమైన ఔషధాలను అందించిన మురళీధర్ ఏమైనా అవసరం ఉంటే తనని సంప్రదించాలని భరోసాను అందించారు. చిన్నారి తల్లిదండ్రులకు సైతం రాత్రి భోజనాలను అందించారు. మురళీధర్ చేసిన సహాయాన్ని గుర్తించిన పలువురు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసించారు.