సంగారెడ్డి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రైతులకు ఎవుసం రాదని ఆంధ్రవాళ్లు వెక్కిరించేవారు.. అలా వెక్కిరించిన వాళ్లే ఈర్ష్య పడేలా సీఎం కేసీఆర్ చలవతో తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో వరి సాగు చేస్తున్నారు.. యాసంగిలో ఆంధ్రాలో 30 ల క్షల టన్నుల ధాన్యం సేకరించారు.. పంజాబ్, హర్యా నా, ఆంధ్రప్రదేశ్ను దాటేసి తెలంగాణలో 90 లక్షల ట న్నుల ధాన్యం సేకరించాం.. తెలంగాణ రైతులను చూసి గర్వపడుతున్నాం.. రాష్ట్రం వేరుపడటం, సీఎంగా కేసీఆర్ ఉండటంతో తెలంగాణ ప్రజలు, రైతులకు మేలు జరుగుతున్నది.. జయశంకర్ సార్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు జరిగేలా చిత్తశుద్ధ్దితో పనిచేస్తున్నారు’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అ న్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మనూరు మం డలం బోరంచలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హరీశ్రావు మాట్లాడారు. నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లోని 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకానికి బసవేశ్వరుని పేరుపెట్టడంపై లింగాయత్లు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాబోయే 70 రోజుల్లో సర్వే పూర్తిచేసి డీపీఆర్ను ప్రభుత్వానికి అందజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అందుకే గోదావరి జలాలను జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాలకు అందజేస్తున్నట్టు చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్, 20 ఏళ్ల టీడీపీ పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇవ్వకపోతే పైపులు బాంబులు పెట్టిపేల్చివేస్తామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు సింగూరు జలాల అంశాన్ని రాజకీయంగా వాడుకున్నారే తప్ప కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏనాడు రైతులకు మంజీరా జలాలు సాగుకు ఇవ్వలేదన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు మృతిచెందితే రూ.5 లక్షల పరిహారం అందజేస్తున్నట్టు చెప్పారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం రూ.4,200 కోట్ల మేర గండి పడినా రైతులకు వానకాలం సీజన్లో రూ.7,500 కోట్ల రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 57,67,980 మంది రైతుల ఖాతాల్లో రూ.6,012 కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు. అనంతరం శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. బసవేశ్వర పథకం ద్వారా నారాయణఖేడ్ సస్యశ్యామలం కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.