బంజారాహిల్స్, జూలై 15: జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం నుంచి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతియేటా ఆషాఢ మాసంలో అమ్మ వారిని శాకాంబరి దేవిగా అలంకరించడంతో పాటు ఆలయాన్ని వివిధ రకాలైన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో అలంకరించి పూజలు నిర్వహిస్తుంటారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలకు ఆలయం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీ పెద్దమ్మ తల్లికి అభిషేకం, అనంతరం, భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఫౌండర్ ట్రస్టీ పి.విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, నవగ్రహ జపం, రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించనున్నారు. ఆదివారం నవగ్రహ రుద్రచండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా, ఆలయంలో అలంకరణకు వినియోగించిన కూరగాయలను పూజల అనంతరం, భక్తులకు వితరణ చేస్తారు.