కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని డివిజన్ కార్పొరేటర్ దేదీప్యతో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేవారు, వాహనాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్తో ఎప్పటికప్పుడూ చేతులను శుభ్రం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలతో పాటు అన్ని చోట్ల భౌతిక దూరం పాటించాలని కోరారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు వీడి కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని తెలిపారు. కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీరాంనగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సిబ్బంది, మధురానగర్కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.