ఆత్మకూరు, జూన్ 6 : పరిసరాలు శుభ్రంగా ఉంటే వ్యాధులు దరిచేరవని మండలంలోని తిరుమలగిరి సర్పంచ్ రంపీస మనోహర్ అన్నారు. ఆదివారం గ్రామంలోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాదారాన్ని, మట్టిని కూలీలతో శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన రహదారికి ఇరువైపులా గృహాల పక్కన కొంతమేరకే మురుగు కాల్వలు ఉండడంతో అపరిశుభ్రత నెలకొంటున్నదన్నారు. డ్రైనేజీలేని చోట ఇళ్లలోని మురుగు నీరు వీధుల్లోకి వస్తుండడంతో దీని నివారణకు చర్యలు తీసుకుంటున్నామని మనోహర్ తెలిపారు. మురుగునీరు, వర్షపు నీరు రోడ్డుపైకి రాకుండా మోరీలు వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలన్నారు. చెత్తా చెదారాన్ని రోడ్లపై వేయొద్దని ఆయన సూచించారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఖానాపురంలో..
ఖానాపురం : మండలంలోని బుధరావుపేటలో పారిశుధ్య పనులు సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలోని వీధుల్లో పిచ్చిమొక్కలు పెరిగాయని, డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయిందన్నారు. పరిశుభ్రత కోసం చెత్తను తీసేయించామని, పిచ్చిమొక్కలను ఉపాధి హమీ పథకంలో కూలీలతో తొలగించినట్లు ఆయన తెలిపారు.