వనస్థలిపురం, ఏప్రిల్ 12 : నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఘరానా మోసానికి తెరలేపాడో కేటుగాడు. ఒరిజినల్ లెటర్లను తలదన్నేలా అపాయింట్మెంట్ ఆర్డర్లను సృష్టించి పూర్తి స్థాయిలో నమ్మకం కలిగేలా చేశాడు. దాదాపు రూ.3 కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాయభాగి సాయినాథ్ అలియాస్ రఘోత్తమ రెండేళ్ల క్రితం తల్లి శారదను తీసుకుని నగరానికి వచ్చాడు. శారదానగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నాడు. స్థానికంగా ఉండే యువతకు తను డీఆర్డీవో డైరెక్టర్ డాక్టర్ సదానంద చారికి పీఏగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. తాను తలుచుకుంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయని నమ్మించాడు.
గత లాక్డౌన్ అనంతరం జూన్లో డీఆర్డీఓలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ నోటిఫికేషన్ పడింది. రూ.5లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని సాయినాథ్ యువతను నమ్మించాడు. కొంతమంది రూ.2.5లక్షల చొప్పున అడ్వాన్స్గా చెల్లించారు. ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి జీతం రాగానే మిగతా రూ.2.5 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. వారిలో కొంత మందికి అచ్చం ఒరిజినల్గా కనిపించేలా అపాయింట్మెంట్ ఆర్డర్లు, రక్షణ శాఖ లెటర్ హెడ్లపై డైరెక్టర్లు ఎస్.సదానందచారి, డాక్టర్ జె.పి సింగ్ పేరుతో స్టాంప్లు వేసి, గ్రీన్పెన్తో సంతకాలు చేయించి ఇచ్చాడు. రూ.79,596ల వేతనం ఇచ్చేలా వాటిని రూపొందించి ఇచ్చాడు. ఇవి తీసుకున్నావారు తమ స్నేహితులు, బంధువుల ద్వారా కూడా డబ్బులు కట్టించారు. దీంతో సాయినాథ్కు వచ్చే దరఖాస్తుల సంఖ్య పెరిగి కాసుల పంట పండింది.
డీఆర్డీవో క్యాంటీన్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సాయినాథ్.. తన ఇంట్లో పనిచేసే పద్మ వద్ద కూడా రూ.1.5 లక్షలు వసూలు చేశాడు. సూర్యనారాయణ అనే మానసిక రోగిని ట్రాప్ చేసి.. హెచ్ఆర్ఓగా పరిచయం చేశాడు. కరోనా వల్ల ఫిబ్రవరిలో ఉద్యోగాల్లోకి తీసుకోలేదని.. 3 నెలల్లో జాయినింగ్స్ ఉంటాయని లెటర్లు చూపించాడు. ఇటీవల సాయినాథ్పై ఒత్తిడి పెరగడంతో పరారయ్యాడు. దీంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసి బాధితులు వారితో కలిసి సాయంత్రం నిందితుడి ఇంటికి చేరుకున్నారు. నిందితుడి ఇంట్లో లెటర్ ప్యాడ్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.