ఫేస్బుక్లో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాలంటూ ఉన్న ప్రకటనను చూసి హబ్సిగూడకు చెందిన ఇద్దరు రూ. 2 లక్షలు మోసపోయారు. కాగ్నిజెంట్లో ఉద్యోగాలంటూ ఉన్న ఒక ప్రకటనను చూసిన హరిచరణ్.. తన స్నేహితుడితో కలిసి అందులో ఉన్న నంబర్ను సంప్రదించారు. ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు.. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజులంటూ మూడు దఫాలుగా వారి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ గురించి ఆరా తీయగా అది నకిలీదని తేలింది. దీంతో మోసపోయామని గుర్తించి బాధితులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
క్రెడిట్ కార్డును ఆక్టివేషన్ చేసుకోవాలంటూ… ఖాతా వివరాలతోపాటు ఓటీపీ తీసుకుని బాధితుడి ఖాతా నుంచి రూ.90వేలు కాజేశారు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం… సుచిత్ర ప్రాంతంలోని జీడిమెట్ల విలేజ్ మీనాక్షి ఎస్టేట్కు చెందిన కందుకూరి కుమార్(35) డిగ్రీ పూర్తి చేసి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు.. కాగా.. గురువారం గుర్తు తెలియని వ్యక్తి ( సైబర్ నేరగాడు) అతడికి ఫోన్ చేసి.. మీ క్రెడిట్కార్డు ఆక్టివేషన్లో లేదు.. తిరిగి ఆక్టివేషన్ చేసుకోవాలి అని నమ్మించాడు… ఈ క్రమంలో ఖాతా వివరాలు తెలుసుకుని.. బాధితుడి నుంచి ఓటీపీ కూడా తీసుకుని అతడి ఖాతా నుంచి రూ.90 వేలు కాజేశాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నాగర్కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని గౌరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జి.సురేశ్ కొంపల్లిలోని మ్యాక్స్లో సేల్స్ మేనేజర్గా పని చేస్తున్నాడు. మార్చి 3న గుర్తు తెలియని వ్యక్తి (సైబర్నేరగాడు) అతడికి ఫోన్ చేసి బజాజ్ ఫైనాన్స్ నుంచి రూ.25 వేల విలువ గల కూపన్కార్డు ఇస్తున్నామని నమ్మించారు. అయితే.. ఇందుకు ప్రాసెసింగ్ ఫీజుకింద రూ.1250 చెల్లించాలని చెప్పగా.. చెల్లించాడు. ఆ తర్వాత మరొకరు ఫోన్చేసి..ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ను మాట్లాడుతున్నాను.. మీకు రుణం మంజూరు అయింది.. జీవిత బీమా ప్రయోజనం కోసం అదే ఖాతా నంబర్లో మరో రూ.4400 చెల్లించాలి అని చెప్పగా రూ.3400, తర్వాత రూ.1000 చెల్లించాడు. ఇలా కాదు ఒకే సారి రూ.4400 పంపించాలని చెప్పగా.. అలాగే చేశాడు. చివరికి మోసపోయానని గుర్తించిన బాధితుడు గురువారం పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఆయా కేసులను నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈఎంఐ బరువును తొలిగిస్తామని మభ్యపెట్టిన సైబర్ నేకగాళ్లు.. ఖాతా వివరాలు, ఓటీపీ తెలుసుకుని బాధితుడి ఖాతా నుంచి రూ. 48,500లను కాజేశారు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం… అమీన్పూర్కు చెందిన ఎం.వినోద్కుమార్.. చందానగర్లోని ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగి. ఈ నెల 14న స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ నుంచి అంటూ గుర్తు తెలియని వ్యక్తి అతడికి ఫోన్ చేశాడు… మీ క్రెడిట్ కార్డుపై సోనా ఇన్సూరెన్స్ పాలసీ యాక్టివేట్ అయింది… అందుకు నెలకు రూ. 29,999 ఈఎంఐ కట్ అవుతుందని అన్నారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన వినోద్.. తనకు ఆ పాలసీ వద్దన్నాడు.. అయితే.. దీన్ని తొలిగిస్తామని.. ఖాతా వివరాలు, ఓటీపీ తీసుకుని బాధితుడి ఖాతా నుంచి రూ. 45,000, రూ. 3800 కాజేశారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.