నీటి పారుదల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. మోసం చేసిన ఓ పాత నేరస్తుడిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పశ్చిమ మండలం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు మండలం, హరిజనవాడ ప్రాంతానికి చెందిన గుర్రం రాజేంద్రప్రసాద్ బీఎస్సీ చదివాడు. కొన్ని రోజుల పాటు రేషన్డీలర్గా పనిచేశాడు. ఆదాయం సరిపోకపోవడంతో డీలర్ షిప్ వదిలేశాడు. వ్యసనాలు, విలాసాలు, పేకాటకు బానిసై ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో పథకం రచించాడు. నీటి పారుదల శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నానని పలువురిని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి చాలా మంది వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడు.
దీంతో రాజేంద్రప్రసాద్ గతంలో దాదాపు 4 కేసుల్లో అరెస్టు అయ్యాడు. తిరిగి జైలు నుంచి వచ్చి వ్యవసాయ పనులు చేసుకున్నాడు. కానీ అతని జల్సాలకు ఆ డబ్బు సరిపోలేదు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు. ఫిబ్రవరి నెలలో ఎస్ఆర్నగర్ ప్రాంతానికి చెందిన సుమంత్ అనే వ్యక్తి నుంచి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.50 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా వాయిదాలు వేస్తూ.. తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో సుమంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్రం రాజేంద్రప్రసాద్ను అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు.