జీడిమెట్ల, జూలై 28 : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని శ్రీ వేంకటేశ్వర కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధిలో ఉన్న నాసెన్స్ ల్యాబ్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో బుధవారం ఏ షిఫ్ట్లో 54 మంది కార్మికులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. కొంతమంది కార్మికులు రియాక్టర్, బాయిలర్ వద్ద పనుల్లో నిమగ్నమై ఉండగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
షిఫ్ట్ ఇన్చార్జి హరిప్రసాద్రెడ్డి(42)కి మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. కార్మికుడు నంద కిషోర్ (28) ఘటన సమయంలో కంపెనీ గోడ దూకడంతో కాలు విరిగింది. మరో కార్మికుడు అర్జున్ (28) తలకు స్వల్ప గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ఇంజిన్ సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. కార్మికులు అల్పాహారం కోసం డైనింగ్హాల్కి వెళ్లిన సమయంలో పేలుడు సంభంవించడంతో ప్రాణనష్టం జరగలేదు.
అగ్ని ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి, అగ్నిమాపక శాఖ డీఎఫ్ఓ డి.సుధాకర్రావు, బాలానగర్ ఎసీపీ పురుషోత్తం యాదవ్, జీడిమెట్ల సీఐ కె.బాలరాజు, ఫైర్ అధికారులు, సిబ్బంది ఘటనా సస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.