సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): గంజాయి ద్రవ పదార్థాన్ని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి కథనం ప్రకారం.. సనత్నగర్కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీపై గతంలో రెండు దోపిడీ, ఓ హత్య యత్నం కేసుతో పాటు ఎన్డీపీఎస్ (నార్కోటిక్స్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్ట్యాన్సస్) యాక్ట్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తన స్నేహితులైన మహ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ సలాం, మహ్మద్ హాజీపాషాలతో కలిసి యాష్ ఆయిల్(గంజాయి ద్రవ పదార్థాన్ని ) తెచ్చి హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో విక్రయించాలని ప్లాన్ చేశారు.
ఈ నలుగురు కలిసి విశాఖపట్నం పడేర్ గ్రామానికి చెందిన వెంకటనారాయణ అలియాస్ వెంకట్తో పరిచయం చేసుకున్నారు. పడేర్కు వెళ్లి తరచూ గంజాయి ఆయిల్ను తెచ్చి అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. యువత, విద్యార్థులకు ఈ గంజాయి అలవాటు అయ్యే వరకు తక్కువ డబ్బులు తీసుకొని విక్రయించారు.
అలవాటుగా మారిన తరువాత ఎక్కువ డబ్బులు తీసుకొని అమ్ముతున్నారు. పడేర్ నుంచి తక్కువ ధరకు కొని, ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు నరేందర్, శ్రీశైలం, మహ్మద్ టకీయుద్దీన్, చంద్రమోహన్ తదితరులు ఈ గ్యాంగ్ బంజారాహిల్స్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుసుకొని బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో దాడి చేశారు.
గ్యాంగ్ లీడర్ మహబూబ్ అలీ, అతడి స్నేహితులు సర్ఫరాజ్, అబ్దుల్ సలాంను పట్టుకున్నారు. వారి వద్ద 1.02 లీటర్ల యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ కోసం ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. గంజాయి ద్రవ పదార్థాన్ని 205 చిన్న బాక్స్లలో నింపి.. ఈ ముఠా విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు . దీని విలువ రూ. 6 లక్షలు ఉంటుందని వివరించారు.