పీర్జాదిగూడ, సెప్టెంబర్14 : హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత కాలం జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు మేడిపల్లి ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. ఒడిస్సా రాష్ట్రం బింజిలీ గ్రామానికి చెందిన ముకుందా రాందారి (33), అదే ప్రాంతానికి చెందిన జయరామ్(23) బతుకు దెరువుకోసం వచ్చి పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో నివాసముంటూ స్థానికంగా సెంట్రింగ్ పని చేస్తుండేవారు. అయితే 2020 మే నెల 6న రాత్రి స్థానికంగా ఉన్న బుద్దానగర్లో ఓ ప్లాట్లో సెంట్రింగ్ పని చేస్తుండగా డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్యన గొడవ జరిగింది. అదే సమయంలో రాందారి ఇనుప రాడ్డుతో జయరామ్ తలపై కొట్టాడు. తీవ్రగాయాలపాలైన జయరామ్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. ఎల్బీనగర్ పదమూడవ మెట్రోపాలిటన్ అదనపు న్యాయస్థానం నిందితుడికి జీవిత కాలం జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.