కవాడిగూడ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింలు అన్నారు. ఎన్ని శక్తులు అడ్డుపడినా దళితబంధు పథకం ఆగదని ఆయన నొక్కి చెప్పారు. ప్రతి పక్షాలు దళితబంధు పథకంపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ దళితబంధుకు మద్దతుగా ఆయన నివాసంలో 5 గంటలకు దీక్ష చేపట్టనున్న నేపధ్యంలో ముందుగా ఆదివారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, దళిత సంఘాల నేతలతో కలిసి ఆయన లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్దికి సీఎం కేసీఆర్ ముందుచూపుతో దళితబంధును తీసుకువచ్చారని, దీన్ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్ధానం కల్పిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న పలు సంక్షేమ పథకాలను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. అభివృద్దిలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.