మాదాపూర్, మే 8: వ్యాధులు, బాధలు ముసిరిన వేళ..కరోనా వైరస్ కోరలు చాచిన వేళ.. నగరానికి చెందిన క్రైస్తవుల ప్రార్థనా నిలయం కల్వరీ టెంపుల్ మానవతా దారులను చూపింది. విపత్తులో రోగులకు బాసటగా నిలిచింది. వైరస్ సోకిన వారికి చికిత్సనందించేందుకు చర్చిలోనే ఏర్పాట్లను చేసింది. నిరుడు లాక్డౌన్ సమయంలో అన్నదానం చేసి ఎంతో మందికి అండగా నిలిచిన మియాపూర్లోని కల్వరీ టెంపుల్ ఈ సారి అంతకుమించి సేవకు ముందుకొచ్చింది. 300 పడకలు, 50 ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసి కొవిడ్ రోగులకు అందుబాటులో ఉంచింది. కొవిడ్ కేర్ సెంటర్ పేరిట అంకురా, ధెరిస్సా వైద్యశాలల సౌజన్యంతో కొవిడ్ సెంటర్ పేరిట కల్వరీ టెంపుల్ వ్యవస్థాపకుడు సతీశ్కుమార్ ఏర్పాటు చేసిన ఈ వసతిని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, విప్ అరెకపూడి గాంధీ, మియాపూర్, హైదర్నగర్ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు.
కల్వరీ టెంపుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్లో చేరిన కరోనా రోగులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటాం. అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం. ఉదయం బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, రాత్రి భోజనం అందించే ఏర్పాట్లు చేశాం. ఏ సమయంలో ఏ మందులు వేసుకోవాలో రోగులకు అవగాహన కల్పిస్తున్నాం. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో కొవిడ్ రోగులను ఉంచి నయం అయ్యే వరకు సేవలు చేయాలని నిర్ణయించాం. బీపీ, షుగర్ ఉన్న వారిని ఇక్కడ చేర్చుకోవడం లేదు. ఎందుకంటే ఇతర వ్యాధులు ఉన్నవాళ్లకు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం అందాలి తప్ప కేవలం ఐసోలేషన్ సేవలు సరిపోవు. పాజిటివ్ వచ్చి ఇంట్లో ఉండలేని వారిని మాత్రమే ఇక్కడ చేర్చుకుంటున్నాం. – రాజేశ్, కొవిడ్ కేర్ సెంటర్ ఇన్చార్జి