కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నది. సుడిగాలిలా చుట్టుముడుతున్నది. లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు. రోగులతో వైద్యశాలలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా చోట్లా బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొన్నది. మరోవైపు కొవిడ్ కారణంగా స్టార్ హోటళ్లు వెలవెలబోతున్నాయి. వచ్చేవారు లేక మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ దవాఖానలు, ప్రముఖ హోటళ్లు వినూత్న ఆలోచనకు తెరతీశాయి. కొవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు పరస్పర ఒప్పందం చేసుకున్నాయి. హోటళ్లలో ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా కరోనా బాధితులను చేర్చుకుంటూ.. ప్యాకేజీల వారీగా వైద్యసేవలను అందిస్తున్నారు. రోజుకు రూ.5 వేల నుంచి రూ.12వేల వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.
నగరంలో ఇప్పటి వరకు 80 హోటళ్లతో పలు వైద్యశాలలు ఇలాంటి ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీంతో వెయ్యి పడకలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యశాలకు వెళ్లే ఇష్టం లేక, హోం క్వారంటైన్కు అనుకూలమైన పరిస్థితులు లేని వాళ్లు ఈ సర్వీసులను వినియోగించుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ ఐసొలేషన్ కేంద్రాల్లో విడిగా రూమ్ను తీసుకోవచ్చు. లేదంటే మరొకరితో కలిసి షేరింగ్ చేసుకునే సౌకర్యం ఉన్నది. కాగా, కొన్ని హోటళ్లు వారం రోజుల ప్యాకేజీతో సేవలు అందిస్తున్నాయి. అందుకు రూ.40వేల నుంచి రూ. 70 వేల వరకు చార్జీలను వసూలు చేస్తున్నాయి. అంతేకాదు కుటుంబం మొత్తం ఉండేందుకు వీలుగా అందుబాటులో గదులను సిద్ధం చేశాయి.
హోటల్ గదుల్లోనే ఉండి చికిత్స పొందాలనుకునే వారికి నిర్వాహకులు వైద్యశాల యజమానులతో కలిసి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రతి రోజు వైద్యుడితో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, హై టీ, డ్రైఫ్రూట్స్, హల్దీ మిల్క్, హెల్తీ డ్రింక్స్ను అందిస్తున్నారు. ప్రత్యేకంగా థర్మోమీటర్, రెస్పిరోమీటర్, శానిటైజర్, మాస్కులు, స్టీమ్ ఇన్హెలర్లతో కూడిన మెడికల్ కిట్ను అందిస్తున్నారు. అత్యవసన పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు వీలుగా ఆక్సిజన్తో కూడిన అంబులెన్స్, వైద్యుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా డయాగ్నోస్టిక్ వెసలుబాటును కూడా కల్పిస్తుండగా, అందుకు అదనంగా డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది.
ఇక హోటళ్లలో అందరికీ ప్రవేశం కల్పించడం లేదు. కేవలం ఐసీఎంఆర్ నిబంధనల మేరకు మాత్రమే గదులను కేటాయిస్తూ వైద్యసేవలను అందిస్తున్నారు. మొదట వైద్యశాలల్లో చేరేవారు 15 నుంచి 60 ఏండ్ల వయసు వారై ఉండాలి. కేవలం కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నవారు, క్వారంటైన్లో ఉండేవారినే చేర్చుకుంటారు. అందుకు రోగి సంబంధిత వైద్యశాలకు వెళ్లి ప్రాథమిక నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ లెవల్స్ 25, ఆక్సిజన్ సంతృప్తిస్థాయిలు 95 శాతానికి పైగా ఉంటేనే హోటళ్లలో చేర్చుకుంటారు. ఆధార్కార్డ్ తప్పనిసరి. కొన్ని హోటల్స్ మాత్రం ఏడురోజుల ప్యాకేజీని తీసుకుంటేనే అనుమతులను ఇస్తున్నాయి.
యశోద హాస్పిటల్ – బెస్ట్ వెస్ట్రన్ అశోకా హోటల్, లక్డీకాపూల్