మేడ్చల్, అక్టోబర్23(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. నూతనంగా పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐపాస్లో 4447 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో జిల్లాలో మరో 8 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. పరిశ్రమల ఏర్పాటులో మేడ్చల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పరిశ్రమల ద్వారా మేడ్చల్ జిల్లాలో ఇప్పటి వరకు రూ. 14,775 కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు మేడ్చల్ జిల్లాలో 5210 పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలో 3479 పరిశ్రమలు మాత్రమే ఉండేవి. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమల అభివృద్ధికి తీసుకున్న చర్యలతో ఏడేండ్లలోనే 5210 పరిశ్రమలు ఏర్పడి, లక్షలాది మందికి ఉపాధి లభించింది. పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక విధానం ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసిన జనరల్, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం అందిస్తూ ప్రోత్సహిస్తున్నది.
మేడ్చల్ జిల్లాలో 8,689 పరిశ్రమలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా బాలానగర్, జీడిమెట్ల, చర్లపల్లి, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాలలో 3,749 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్క్లు ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో 2,62,968 మంది ఉపాధి పొందుతున్నారు. త్వరలోనే ఘట్కేసర్ మండలం మాదారంలో మరో 200 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడనుంది.
జిల్లాలో ఉన్న పరిశ్రమల నుంచి ప్రధానంగా ఫార్మా, బల్క్డ్రగ్స్, ఏరోస్పేస్ పరికరాలు (డిఫెన్స్), ప్లాస్టిక్, ఆహార ఉత్పత్తులు, సీడ్స్(విత్తనాలు), డ్రిల్లింగ్ మైనింగ్ పరికరాల ఉత్పత్తులు జరుగుతున్నాయి. విదేశాలకు వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల నుంచి 4447 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని దరఖాస్తులకు నిబంధనల మేరకు అనుమతులు వస్తున్నాయి. మరిన్ని పరిశ్రమల ఏర్పాటుతో జిల్లాకు 8 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం మూలంగానే జిల్లాలో పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయి. – రవీందర్, మేడ్చల్-మల్కాజిగిరి పరిశ్రమల జిల్లా అధికారి