సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): ఇన్వెస్ట్మెంట్ యాప్లో పెట్టుబడి పెట్టిన నగరానికి చెందిన ఓ వ్యక్తి.. సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.1.3లక్షలు పోగొట్టుకున్నాడు.. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లాలాగూడకు చెందిన ఎజాజ్ పాషాకు.. ఇన్వెస్ట్మెంట్ యాప్లో పెట్టుబడి పెడితే.. రోజుకు పెట్టిన పెట్టుబడిపై 30 శాతం లాభాలిస్తున్నారని.. స్నేహితుడు చెప్పాడు. దీంతో అతను ఇజెడ్ప్లాన్స్ పేరుతో ఉన్న యాప్లో ముందుగా రూ. 5 వేలు పెట్టుబడి పెట్టగా.. లాభాలు ఇచ్చారు.. ఆ తర్వాత రూ. 25 వేలు పెట్టగా లాభం వచ్చింది. అంతటితో ఆగకుండా ఏకంగా లక్ష రూపాయలకుపైగా పెట్టుబడి పెట్టడంతో ఆ యాప్ బిచాణా ఎత్తేసింది. మోసపోయానని గుర్తించిన బాధితుడు బుధవారం సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బషీర్బాగ్లోని జస్ఫర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మెయిల్ ఐడీని హ్యాక్ చేసిన సైబర్నేరగాళ్లు.. ఆ సంస్థ హెడ్ మెయిల్ పంపించినట్లు కరెంట్ ఖాతా ఉన్న కరూర్ వైశ్యా బ్యాంకుకు పంపించారు. అందులో తన వద్ద చెక్బుక్ అయిపోయిందని.. వెంటనే ఈ రెండు నంబర్లకు రూ. 8 లక్షలు, రూ. 9 లక్షల చొప్పున ఆర్టీజీఎస్ చేయండంటూ కంపెనీ హెడ్ మెయి ల్ పంపించినట్లుగా సైబర్నేరగాళ్లు పంపించారు. బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి కంపె నీ ప్రతినిధులకు ఫోన్ చేయగా.. తాము ఎలాంటి మెయిల్స్ పంపలేదని చెప్పారు. ఈ మేరకు కంపెనీవారి ఫిర్యాదుతో సైబర్క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.