వికారాబాద్, జూలై 13, (నమస్తే తెలంగాణ) : భరోసా కేంద్రం అద్భుత ఫలితాలు అందిస్తున్నదని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా కేంద్రం 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ, అదనపు ఎస్పీ డాక్టర్ రషీద్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భరోసా కేంద్రం బాగా పనిచేస్తున్నదని కితాబిచ్చారు. అద్భుత ఫలితాలందిస్తున్న భరోసా కేంద్ర సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ నారాయణ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచార కేసుల్లో బాధితులు వారి జీవితం ఇక్కడితో ముగిసిపోయిందని బాధపడకుండా వారికి సరైన మార్గం చూపిస్తున్నట్లు తెలిపారు. వారికి ధైర్యం, సమాజం పట్ల అవగాహన కల్పించడానికి భరోసా కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వికారాబాద్ జిల్లా భరోసా కేంద్ర ఇన్చార్జి నిరోష మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల్లో భరోసా కేంద్రానికి వచ్చిన కేసుల విషయాలు.. తీసుకున్న చర్యలు, విజయాలను వివరించారు.
18 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై జరిగిన పోక్సో కేసులు, రేప్ కేసుల బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 157 కేసులు నమోదు చేయగా.. వీటన్నింటికీ భరోసా కేంద్రంలో బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. నేర ఆరోపణ కలిగిన వ్యక్తులకు సరైన శిక్ష పడేలా చూస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో, రేప్ కేసుల బాధితులకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.46,50,750 సాయం అందిందని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి రూ.27లక్షలను బాధితులకు అందేలా చేశామని వివరించారు. 2018లో కేంద్రం డీఎంఎఫ్టీ నేషనల్ అవార్డు ప్రకటించిందని, అందులో తెలంగాణలో ఒక్క వికారాబాద్ జిల్లాకే ఈ అవార్డు వచ్చిందన్నారు. అనంతరం భరోసా కేంద్రం సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.