సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అతిపెద్ద సెక్స్ రాకెట్ గుట్టును సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. ఉద్యోగాల పేరుతో అమాయకులను వ్యభిచార వృత్తిలోకి దింపుతూ, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 39 కేసుల్లో 17 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రాడిసన్ హోటల్ మేనేజర్ ఉన్నాడు. ఈ ముఠాకు చిక్కిన 14,190 మంది బాధితులను వ్యభిచార వృత్తిలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్వ్రీంద్ర మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
తీగలాగితే డొంక కదిలింది..
అంతర్జాతీయ స్థాయిలో హైటెక్ వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో నవంబర్ 15న సన్సిటీలో ఆ ముఠా నిర్వాహకులైన సల్మాన్ అలియాస్ వివేక్, ఇర్ఫాన్ అలియాస్ వికాస్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిచ్చిన సమచారంతో అదేనెల 18వ తేదీన మహ్మద్ ఆదీమ్ అలియాస్ అర్నవ్, సమీర్, హర్బీందర్ కౌర్ను సోమాజిగూడలో అరెస్టు చేశారు. ఈ ముఠాకు డ్రగ్ సరఫరా దారులతో సంబంధాలు ఉన్నాయి.
వీరు కూడా డ్రగ్ సరఫరా దారులుగా చలామణి అవుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి వాట్సాప్ గ్రూప్లు, కాంటాక్టులను పరిశీలించగా.. దేశ వ్యాప్తంగా అమ్మాయిలను సరఫరా చేసే నెట్వర్క్ వెలుగులోకి వచ్చిందని సీపీ చెప్పారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా వీరికి ఉన్న నెట్వర్క్ వివరాలను సేకరించినట్టు తెలిపారు. దీంతో ఈ ముఠాలు వ్యభిచారంతోపాటు డ్రగ్స్ దందాను కూడా చేస్తున్నట్టు వెల్లడైందని సీపీ చెప్పారు. బాధితుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్కత, అసొం, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, ఉజ్జెకిస్తాన్, రష్యాకు చెందిన వారు ఉన్నారని తెలిపారు.
అరెస్టయిన నిందితులు వీరే…
అరెస్టయిన వారిలో రాడిసన్ హోటల్ మేనేజర్ రాకేశ్ ఉన్నాడు. అతడితోపాటు మహ్మద్ ఆదీమ్ అలియాస్ అర్నవ్, మహ్మద్ సమీర్, హర్బీందర్ కౌర్, మహ్మద్ సల్మాన్ ఖాన్, మహ్మద్ అబ్దుల్ ఖరీమ్, యరసాని జోగీశ్వర్రావు, నడింపల్లి సాయిబాబు గౌడ్, శైలేంద్ర ప్రసాద్ అలియాస్ సలీమ్, మహ్మద్ అస్రఫ్, పసుపులేటి గంగాధరి, మహ్మద్ ఫయాజ్, విష్ణు అలియాస్ శరణప్ప, సాయి సుధీర్, రిషి అలియాస్ మహ్మద్ అబ్దుల్ సల్మాన్, కోడి శ్రీనివాస్, అబ్దుల్ రఫీక్ ఖాన్, సరబేశ్వర్రౌత్ (ఒడిశా)ను అరెస్టు చేశారు.
అరెస్టయిన ఈ ముఠా సభ్యులు మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్, సనత్నగర్, ఎస్ఆర్నగర్, అబిడ్స్, బోయిన్పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో వ్యభిచార గృహాలు నిర్వహించారు. పోలీసులకు పట్టుబడకుండా చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నారని సీపీ తెలిపారు. ఈ ముఠాలకు మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగే మానవ అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నిర్వహణలో 70 శాతం భాగస్వామ్యం ఉన్నదని సీపీ చెప్పారు. వీరి నుంచి 34 స్మార్ట్ ఫోన్లు, ఒక కీ ప్యాడ్ ఫోన్, మూడు కార్లు, ఒక ల్యాప్టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నామని, నిందితులపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని సీపీ వెల్లడించారు. ఈ కేసును డీసీపీ ధార కవిత నేతృత్వంలోని బృందం ఛేదించింది. కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
నెట్వర్క్.. నిర్వహణ ఇలా…