హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. త్వరలోనే జేఈఈ పరీక్షల షెడ్యూల్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఐఐటీలు ఇటీవలే నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) అమల్లో భాగంగా ఈ వెయిటేజీని పరిగణనలోకి తీసుకోనున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు ఎన్ఈపీని అమలుచేస్తుండటంతో ఇది తప్పనిసరికానున్నదన్న వాదనలున్నాయి.
ఐఐటీల్లో ప్రవేశాలకు గతంలో ఇం టర్ మార్కుల వెయిటేజీ అమల్లో ఉండేది. టాప్-20 పర్సంటైల్ తీసే క్రమంలో ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకొనేవారు. కానీ, తర్వాత క్రమంలో రద్దుచేశారు. దీనిపై ఐఐటీ మద్రాస్కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ స్పందిస్తూ.. ఇంటర్ మార్కుల వెయిటేజీని అమలుచేసే ఆలోచన ఉన్నదని, అయితే, ఎలా అమలుచేయాలన్న అంశంపై నిర్ణయించలేదని తెలిపారు. ప్రస్తుతం జనరల్, ఓబీసీ క్యాటగిరీ విద్యార్థులకు ఇంటర్లో 75 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్న నిబంధన అమల్లో ఉన్నదని, ఇప్పటివరకు ఈ విధానమే కొనసాగవచ్చని జేఈఈ శిక్షకుడు కృష్ణచైతన్య పేర్కొన్నారు.
ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ..
కరోనా కారణంగా 2021, 2022 సంవత్సరాల్లో ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం కరోనా అంతగా లేకపోవడం, 100శాతం సిలబస్కు విద్యాబోధన కొనసాగుతుండటంతో ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని కొనసాగించే అవకాశం ఉన్నది. దీనిపై మరికొద్దిరోజుల్లోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.