సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రూ. 80 లక్షల విలువజేసే కోల్మైన్ షేర్లు ఇస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వృద్ధుడికి కోటి రూపాయలు టోకరా వేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆగాపూర్ నివాసి 2015లో గౌహతిలో ఉన్నాడు. ఆ సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ కొందరు నమ్మించారు. తమ వద్ద మీరు పాలసీ తీసుకోండి… మీకు రూ. 80 లక్షల విలువైన కోల్మైన్ షేర్లు ఇస్తాం.. కొన్ని రోజుల్లోనే అవి కోట్ల రూపాయల ధర పలుకుతాయంటూ నమ్మించి, పాలసీ పేరుతో రూ. 20 లక్షలు లాగేశారు. ఆ తరువాత మీకు షేర్లు అలాట్ అయ్యాయంటూ నమ్మించి, కొన్ని పత్రాలు పంపించారు.
ఆ తరువాత మీ షేర్ల విలువ పెరిగిందని, వాటిని వెంటనే ైక్లెయిమ్ చేసుకుంటే భారీగా డబ్బులు వస్తాయంటూ చెప్పారు. ఇందుకు కొంత పన్ను చెల్లించాల్సి వస్తుందని నమ్మిస్తూ రూ. 80 లక్షల వరకు వసూలు చేశారు. ఆరు నెలల క్రితం బాధితుడు గౌహతి నుంచి హైదరాబాద్కు వచ్చి ఆగాపూర్లో ఉంటున్నాడు. ఇటీవల కూడా అతడి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేశారు. 2015 నుంచి 2021 జూలై నెల వరకు కోటి రూపాయలు వరకు వసూలు చేశారు. నేరగాళ్లు ఇంకా డబ్బులు కావాలని కోరడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో.. ఓ యువకుడు ఉద్యోగం వేటలో గూగుల్లో పరిశీలించాడు. ఈ క్రమంలో అందులో ఒక నంబర్ను గుర్తించి ఫోన్ చేశాడు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన యువకుడు రూ. 1.8 లక్షలు పోగొట్టుకున్నాడు.