ప్రస్తుతం 138 మంది చికిత్స తీసుకుంటున్నారు..
అందుబాటులో 550 బెడ్లు.. ఇంకా.. 40 పెంచుతున్నాం..
వ్యాధి ముదరక ముందే రిమ్స్కు రండి..
nలక్షణాలు ఉంటేనే పరీక్ష చేయించుకుంటే మంచిది..
46 మంది పాజిటివ్ గర్భిణులకు ప్రసవాలు చేశాం..
ల్యాబ్ను ప్రారంభిస్తాం..
‘నమస్తే’తో రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్
ఎదులాపురం, మే 4:“ఆదిలాబాద్ రిమ్స్లో కొవిడ్ బాధితులకు సర్కారు సహకారంతో మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఆరు వేల లీటర్ల ఆక్సిజన్ అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం 138 మంది చికిత్స తీసుకుంటున్నారు. 776 బెడ్స్కు 550 కరోనా పేషెంట్లకు కేటాయించాం. ఇంకా 40 పడకలు పెంచాలని సర్కారు నుంచి ఆదేశాలు అందాయి. చివరి నిమిషంలో ప్రాణం నిలిపే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది బాధితులు వ్యాధి ముదిరిన తర్వాత వస్తున్నారు. ముందుగా వస్తే ప్రాణాలు నిలుపుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు పాజిటివ్ వచ్చిన 46 మంది గర్భిణులకు ప్రసవాలు చేశాం. వారంతా బాగానే ఉన్నారు. కాగా, త్వరలోనే ఆర్టీపీసీఆర్ను ప్రారంభిస్తాం” అని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ పేర్కొన్నారు. ఆయనను కరోనా సేవలపై ‘నమస్తే’ పలకరించగా.. పలు విషయాలు వెల్లడించారు.
నమస్తే తెలంగాణ : రిమ్స్లో కొవిడ్ బాధితులకోసం ఎన్ని పడకలు అందుబాటులో ఉంచారు?
రిమ్స్ డైరెక్టర్ : రిమ్స్లో 776 పడకల్లో 550 పడకలు కొవిడ్ వార్డులో వినియోగిస్తున్నాం. ఇందులో ఆక్సిజన్ బెడ్స్ 295 , ఈసీయూ బెడ్స్ 105 , ఐసొలేషన్ బెడ్స్ 110 అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 138 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 40 పడకలు పెంచాలని ఆదేశాలు వచ్చాయి. అవి కూడా సిద్ధం చేశాం.
నమస్తే : ప్రస్తుతం ఎన్ని వేల లీటర్ల ఆక్సిజన్ అందుబాటులో ఉన్నది ?
డైరెక్టర్ : రిమ్స్లో ప్రస్తుతం 6వేల లీటర్ల ఆక్సిజన్ అందుబాటులో ఉన్నది. ఆక్సిజన్ డంప్ చేసుకొని నిల్వ చేసుకున్నాం. 465 ఆక్సిజన్ పాయింట్లు ఏర్పాటు చేశాం. ఇందులో 400 కొవిడ్ వార్డులో వినియోగిస్తున్నాం. నిత్యం సుమారుగా 1,000 లీటర్ల వరకు ఆక్సిజన్ను బాధితులకు వినియోగిస్తున్నాం. ప్రతి రెండు రోజులకోసారి ఆక్సిజన్ వాహనం ఇక్కడికి వస్తున్నది. ఇవికాకుండా 232 ఆక్సిజన్ సిలిండర్లను ఎమర్జెన్సీ కోసం అందుబాటులో ఉంచాం. కొవిడ్ వార్డులో బాధితులు కొందరు అవసరం లేకున్నా ఆక్సిజన్ వాడుతున్నారు. అది మంచిది కాదు. భవిష్యత్లో దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.
నమస్తే : కొవిడ్ బాధితులు రిమ్స్కు ఏ పరిస్థితిలో వస్తున్నారు ?
డైరెక్టర్ : పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత బాధితులు ముందుగా ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్తున్నారు. లక్షల రూపాయలు వృథాగా ఖర్చు చేసి వ్యాధి ముదిరిన తరువాత రిమ్స్కు వస్తున్నారు. ఈ సమయంలో డాక్టర్లు వైద్యం అందిస్తున్నా కొన్ని సందర్భాల్లో బాధితుల శరీరం సహకరించకపోవడంతో మరణిస్తున్నారు. ఇలాంటప్పుడు రిమ్స్లో బాధితులు చనిపోతున్నారని బద్నాం చేస్తున్నారు.
నమస్తే : బాధితులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? ఎంత మంది వైద్యులు ఉన్నారు ?
డైరెక్టర్ : బాధితుల కోసం మొత్తం 15 మంది వైద్యులతో పాటు, 171 మంది పారిశుధ్య కార్మికులు , స్టాఫ్నర్స్, సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది ఉన్నారు. నిత్యం షిఫ్టుల వారీగా వైద బృందం పర్యవేక్షణ చేస్తున్నది. అవసరమున్న బాధితులకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇస్తున్నాం. వార్డులో ఉన్న బాధితులను బట్టి 50 శాతం స్టాక్ వార్డులో ఉంచుతున్నాం. మరో 50 శాతం స్టోర్ రూంలో అందుబాటులో ఉంచుతున్నాం.
నమస్తే : రిమ్స్లో నిత్యం ఎంత మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు ?
డైరెక్టర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు 300 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. లక్షణాలు లేనివారు కూడా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలా చేస్తే లక్షణాలు ఉన్నవారు అక్కడ ఉన్నప్పుడు వారి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేసిన పరీక్షల్లో పది శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. లక్షణాలు ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేసుకోవాలి.
నమస్తే : పాజిటివ్ వచ్చిన గర్భిణులకు ఎంత మందికి ప్రసవాలు చేశారు ?
డైరెక్టర్ : కొవిడ్ సెకెండ్ వేవ్ నుంచి ఇప్పటివరకు పాజిటివ్ వచ్చిన 46 మంది గర్భిణులకు ప్రసవాలు చేశాం. గర్భిణుల ప్రసవాల కోసం ప్రైవేట్ వైద్యశాలల వారు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో రిమ్స్కు వచ్చిన వీరికి గైనకాలిజిస్టులు జాగ్రత్తలు తీసుకొని ధైర్యంగా ప్రసవాలు చేశారు.
నమస్తే : కరోనా బాధితులకు ఎలాంటి భోజనం ఇస్తున్నారు ?
డైరెక్టర్ : కొవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందజేస్తున్నాం. మెనూ ప్రకారం ఉదయం ఇడ్లీ, వడ, దోశ, మధ్యాహ్నం చపాతి, అన్నం, గుడ్లు, సాయంత్రం అన్నం, పప్పు ,పాలు, డ్రైఫ్రూట్స్తో పాటు శుద్ధ జలం అందిస్తున్నాం. ఒక్కో బాధితుడికి రోజుకు రూ.200 వెచ్చించి భోజనం అందజేస్తున్నాం.
నమస్తే : ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఎప్పటి వరకు ప్రారంభమవుతుంది?
డైరెక్టర్ : ఆర్టీ పీసీఆర్ ల్యాబ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిమ్స్ నుంచి 5 శాంపిళ్లను ఆదిలాబాద్ రిమ్స్కు పంపించారు. వీటిని పరీక్షలు చేసి వచ్చిన నివేదికను నిమ్స్కు పంపిస్తాం. నిమ్స్ నివేదిక, రిమ్స్ నివేదిక రెండు సమానంగా వస్తే ప్రభుత్వ ఆదేశాలమేరకు వారు ఆదిలాబాద్ ల్యాబ్లోనే నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు లాగిన్ ఐడీ ఇస్తారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. త్వరలోనే ప్రారంభిస్తాం.
నమస్తే : ఈ సమయంలో వైద్యులు, సిబ్బందిని అదనంగా భర్తీ చేశారా ?
డైరెక్టర్ : ఇదివరకే కొంతమంది వైద్యులను భర్తీ చేశాం. మరికొందరిని భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది.36 మంది స్టాఫ్ నర్స్లు, 72 మంది పారిశుధ్య కార్మికులు, 10 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ముగ్గురు డీఈవోలను భర్తీ చేశాం. 9 మందిని వివిధ విభాగాల్లో ప్రొఫెసర్లను భర్తీ చేస్తాం.
నమస్తే : ఇప్పటివరకు ఎంతమంది బాధితులకు చికిత్స అందించారు?
డైరెక్టర్ : గత ఏడాది నుంచి మే వరకు 2709 మంది బాధితులకు చికిత్స అందించాం. ఇందులో 161 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 132 మంది పరిస్థితి విషమించి మృతిచెందారు. ప్రస్తుతం కొవిడ్ వార్డులో 389 పడకలు ఖాళీలు ఉన్నాయి.