కొండాపూర్ : ఉపాధ్యాయులు తరగతిని దాటి సరికొత్త పాఠాలు నేర్చుకోవాలని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు నైపుణ్యతలను పెంచుకోవడంతో పాటు నైతికత, మంచి మనస్సుతో సహకారాన్ని అందించాలని ఇంగ్లీషు అండ్ ఫారెన్ ల్యాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఈఫ్లూ) రిటైర్డ్ ప్రొఫెసర్ వీ సుధాకర్ తెలిపారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉపాధ్యాయుల శిక్షణ కోసం ‘ఇన్ -సర్వీస్’ ట్రైనింగ్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ది దేశానికి అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులు కేవలం తరగతి గదికే పరిమితమవ్వకుండా బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, తమ స్కిల్స్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు. అనంతరం వర్సిటీ పూర్వ విద్యార్థులు అందజేసిన ట్యాబ్లు, మొబైల్ ఫోన్లను ఆన్లైన్ తరగతులకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. ఉపాధ్యాయుల శిక్షణ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (డీఈఈటీ) ఆధ్వర్యంలో వర్సిటీలోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగంలో 21 రోజుల పాటు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ వై సుధాకర్రెడ్డి, డాక్టర్ మధుసూదన్, ప్రొఫెసర్ భువనేశ్వర లక్ష్మీ, ప్రొఫెసర్ వీఎస్ నాగేశ్వర రావు, డాక్టర్ గీత గోవింద, డాక్టర్ క్రిష్ణ, పీ మురళీ, డాక్టర్ టీ సుమలిని, డాక్టర్ ఏఎస్ జలందరచారీ, తదితరులు పాల్గొన్నారు.