న్యూఢిల్లీ : కొవిడ్ వార్డులో సేవలందిస్తున్న ఓ డాక్టర్పై కరోనా రోగి భార్య దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం జీటీబీ ఆస్పత్రిలో చేరాడు. అతన్ని చూసేందుకు భార్య ఆస్పత్రికి వచ్చింది. కొవిడ్ వార్డులోకి రావొద్దని విధుల్లో ఉన్న డాక్టర్ అహ్మిత నిలువరించింది. ఈ క్రమంలో కొవిడ్ రోగి భార్య.. డాక్టర్ అహ్మితపై చేయి చేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే సదరు మహిళకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఆమెను అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.