ఏనాడైనా మా పోరాటాలకు మద్దతు ఇచ్చారా?
ఈటలకు తెలంగాణ ప్రజా సంఘాల ప్రశ్న
ఖైరతాబాద్, మే 4: తన 20 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ దళితులు, బడుగు, బలహీనవర్గాల పోరాటాలకు మద్దతు ఇవ్వని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనపై భూకబ్జాల ఆరోపణలు రాగానే ఆత్మగౌరవం అంటూ కొత్త వాదన తీసుకొస్తున్నారని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుకున్న ఈటల దొరలా ప్రవర్తించలేదా? అని ప్రశ్నించారు. ఎస్సీలు, బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే మద్దతివ్వాలని అన్నారు. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న ఆయా సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఈటలదని మండిపడ్డారు. కరోనాతో వేల మంది మృతిచెందడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే కారణమని గజ్జెల కాంతం విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసలు రంగును ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని చిత్తుగా ఓడించడమే దీనికి నిదర్శనమన్నారు. సమావేశంలో ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణ, ఉపాధ్యక్షుడు బండకింది సింగరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.