కొండాపూర్ : వారాంతపు కార్యక్రమాలలో భాగంగా ఆదివారం సాయంత్రం మాదాపూర్లోని శిల్పారామంలో పలువురు నృత్యకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో అలరించాయి. ఆహ్లాదకర వాతావరణంలో వినసొంపైన సంగీతానికి కనువిందు చేసే రీతిలో నృత్య ప్రదర్శనలిస్తూ ఆకట్టుకున్నారు. ప్రదర్శనల్లో వెంకటేశ్వర నృత్య నికేతన్ గురువర్యులు ప్రతిభారాజ్ గౌడ్ ఆధ్వర్యంలో వారి శిష్య బృందం పలు కీర్తనలను కూచిపూడి నృత్యరూపకంలో నర్తించి ఆకట్టుకున్నారు. ఇందులో శ్రీ విజ్ఞరాజన్ భజేయం, ముద్దుగారే యశోద, నీలమేఘ శరీర, థిల్లాన, జాలరులు కురియగా, గాయత్రీ మంత్రం, భామాకలాపం, భరత వేదముగా, శివస్తుతి, తరణ తిల్లాన అంశాలను నృత్యకారిణులు నేహా, శ్రేయ, ఐశ్వర్య, పూజ, ఉమా లలిత, కీర్తన, వర్షిణి, సంజన, అక్షిత, సాహితి, గాయత్రీ తదితరులు తమ నర్తనతో అలరించారు.