అంబర్పేట, సెప్టెంబర్ 3 : దేశవ్యాప్తంగా మిల్లెట్ ఉత్పత్తులపై శిక్షణ, ప్రమోషన్ కోసం ఇండియన్ మిల్లెట్ అసోసియేషన్తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు విద్యానగర్లోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐఎంహెచ్) ప్రిన్సిపాల్ సంజయ్ కె.ఠాకూర్ తెలిపారు. శుక్రవారం బాగ్అంబర్పేట, డీడీకాలనీలో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఐఎంఏ, ఐఎంహెచ్ల మధ్య ఒప్పందం జరిగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మిల్లెట్స్కు చాలా ప్రాధాన్యత ఉండేదని, పేదలు ఈ మిల్లెట్లను ఎక్కువగా తినేవారని చెప్పారు. ప్రస్తుతం మిల్లెట్ ఆహారం ఉన్నవాళ్లు అధికంగా ఉపయోగిస్తున్నారన్నారు. అయితే 2023ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్ గా ప్రకటించిన నేపథ్యంలో మిల్లెట్ ఉత్పత్తులు, వంటకాల పై ప్రమోషన్, ప్రచారం కోసం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా మిల్లెట్స్ పై హోటల్ మేనేజ్మెంట్ కళశాలల్లో సిలబస్ను కూడా పొందుపరుస్తున్నామన్నారు. మిల్లెట్స్ బేస్డ్ క్యాంపెయిన్, స్కిల్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్ ను కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఎంఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి.వెంకటేశం మాట్లాడుతూ.. ఆరోగ్యకర రాష్ట్రం, దేశం, రోగనిరోధక శక్తిని పెంచేందుకు కొత్త రకమైన టెక్నాలజితో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు చెప్పారు.
త్వరలోనే మరిన్ని అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పుట్ ప్రొడక్షన్ హెచ్ఓడీ జి.ఎస్.వివేకానంద, హౌజ్ కీపింగ్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ హెచ్ఓడీ ఎస్.సరస్వతి, శ్రీనివాస్శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.