ఎల్బీనగర్, ఆగస్టు 5: ఎల్బీనగర్ జోన్ పరిధిలోని సర్కిళ్ల వారీగా అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆపై అక్రమంగా నిర్మించిన కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కోరఢా జులిపిస్తున్నారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిళ్ల పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన భవనాలపై దృష్టి సారిస్తున్న ప్రత్యేక టాస్క్ఫోర్సు అధికారులు స్థానిక టౌన్ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి కూల్చివేతలను జోరుగా చేపడుతున్నారు. జోన్ వ్యాప్తంగా ఐదు సర్కిళ్ల పరిధిలో ఇప్పటి వరకు 23 అక్రమ భవన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. జోన్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై అధ్యయనం చేసి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను గుర్తించి కూల్చివేస్తున్నామని జోనల్ సీపీ ప్రసాద్ తెలిపారు.
సర్కిళ్ల వారీగా టౌన్ప్లానింగ్ అధికారులు కూడా తాజా అక్రమ నిర్మాణాలు కొన్ని తొలగిస్తున్నారు. అయితే నిర్మాణాల తొలగించే విషయంలో పూర్తిగా ప్రభుత్వ స్థలాల్లో, ఆక్రమించిన స్థలాల్లో నిర్మాణాలు చేసుకున్న వారిని వదిలి వ్యక్తిగతంగా నిర్మించుకున్న భవనాలపై అధికారులు ప్రతాపం చూపుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి.అంతేకాకుండా భవానాలను నిర్మిస్తున్న సమయంలో అమ్యామ్యాలు తీసుకుని మిన్నకుంటున్న అధికారులు ప్రస్తుతం అక్రమ నిర్మా ణం అంటూ కూల్చివేసేందుకు నోటీసులు జారీ చేయడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.కాప్రా సర్కిల్ పరిధిలో 5, ఉప్పల్ సర్కిల్ పరిధిలో 5 , హయత్నగర్ సర్కిల్ పరిధిలో 4, ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో 4, సరూర్నగర్ సర్కిల్ పరిధిలో 5 భవనాలను కూల్చి వేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
ఎల్బీనగర్ జోన్ వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్మించిన భవనాలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రధానంగా భవానాల్లో వదలాల్సిన ఖాళీ స్థలాలను వదలకుండా కట్టడంతో పాటుగా అనుమతులు పొందిన అంతస్తుల కంటే ఎక్కువ అంతస్తులను నిర్మాణం చేయడం, పెంట్ హౌస్లు నిర్మాణం చేసుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. వీరికి ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పాటు గా వారి నుంచి సంజాయిషీ అడుగుతున్నారు.