హైదరాబాద్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – హైదరాబాద్ ( IIT-H ) ప్రస్తుతమున్న లోగోలో అధికారికంగా తెలుగు పేరును జోడించింది. ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లీష్ భాషలో ఉన్న లోగోకు తెలుగును జోడించడంతో కాస్త కొత్తదనం కనిపిస్తోంది. భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ అని లోగోలో ముద్రించారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ నూతన లోగోను పొందుపరిచారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐటీ హైదరాబాద్లో ఎక్కువ మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు విద్యార్థులు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఆ లోగోను పెట్టుకోనున్నారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి కూడా తెలుగు వ్యక్తే. మొత్తంగా ఐఐటీ హైదరాబాద్లో తెలుగు పేరును జోడించడంతో ఆ లోగోకు ప్రత్యేకత ఏర్పడింది. ఇక నుంచి ఐఐటీ హైదరాబాద్ అధికారిక కార్యక్రమాలు, డాక్యుమెంట్లలో ఈ కొత్త లోగో ఉండనుంది.