హైదరాబాద్: అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ (GHMC) అనుమతులు ఇచ్చిన తర్వాత భవన యజమానుల నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదాలు కొనసాగుతున్నాయని అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి (Fire DG Nagi Reddy) అన్నారు. బిల్డింగ్ నిర్మాణ సమయంలోనే ఫైర్ నిబంధనలు పాటించాలని సూచించారు. హైదరాబాద్లోని (Hyderabad) భవన సముదాయాలపై ఆడిట్ను కొనసాగిస్తున్నామని, అది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పారు. హైదరాబాద్లోని మాదాపూర్ ఫైర్స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో నాగిరెడ్డి పాల్గొన్నారు. ఫైర్స్టేషన్లోని అగ్నిమాపక యంత్రాల పనితీరును సిబ్బందికి వివరించారు.
అనంతరం డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్లో 34 ఫైర్ స్టేషన్లు ఉన్నాయని, ప్రస్తుతం జనాభాకు అనుగుణంగానే అగ్నిమాపక పరికరాలు ఉన్నాయని చెప్పారు. ఏదైనా ప్రమాద ఘటన జరిగిన వెంటనే సమాచారం అందించాలని సూచించారు. హైదరాబాద్ మహానగరంలో 6 వేల వరకు హై రేంజ్ బిల్డింగులు ఉన్నాయని చెప్పారు. అగ్నిప్రమాదాలకు విద్యుదఘాతాలు ప్రధాన కారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖలో మొత్తం 137 ఫైర్ స్టేషన్లు ఉన్నాయని, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక వాహనం ఉంటుందని చెప్పారు. ఒక బ్రాంబో స్కై లిఫ్ట్ పనిచేస్తుందన్నారు. అగ్ని ప్రమాదాలపై గతేడాది దాదాపు 8 వేల ఫోన్కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ఇప్పడు కూడా 20 నుంచి 30 కాల్స్ వస్తున్నాయని తెలిపారు.