ఖమ్మం, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాద్రిలో బుధవారం శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కొవిడ్ నిబంధలన మేరకు అర్చకులు, ఆలయ అధికారులు ఈఏడాది కూడా ఆలయ ప్రాంగణంలోని బేడామండపంలో నిరాడంబరంగా నిర్వహించారు. భక్తరామదాసు చేయించిన దివ్యాభరణాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించి బేడా మండపానికి తీసుకొచ్చారు. రజత సింహాసనంపై రామయ్యను, సీతమ్మను ఆశీనులను చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లాన్ని ఉంచారు. 12:10 గంటలకు స్వామివారు సీతమ్మవారికి మాంగళ్యధారణ చేశారు. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించగా, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దంపతులు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు పలు ప్రధాన దేవాలయాల నుంచి వచ్చిన పట్టువస్ర్తాలను అర్చకులు సీతారాములకు సమర్పించారు. 12:30 గంటలకు తలంబ్రాల వేడుక నిర్వహించారు. కల్యాణ వేడుకలను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయగా భక్తులు ఇళ్లల్లోనే ఉండి తిలకించారు. కాగా, గురువారం సంప్రదాయబద్ధంగా సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం జరుగనున్నది. కొవిడ్ నిబంధనలతో భక్తులు నేరుగా సీతారాముల మహోత్సవాన్ని తిలకించలేకపోయిన నేపథ్యంలో స్వామివారి ప్రసాదాన్ని, ముత్యాల తలంబ్రాలను పోస్టు ద్వారా పంపిస్తామని ఈవో శివాజీ తెలిపారు. ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి తపాలశాఖ ద్వారా ఇంటికే పంపిస్తామన్నారు.
వేములవాడలో ఆంతరంగికంగా దివ్యఘట్టం
వేములవాడ టౌన్: వేములవాడ రాజరాజేశ్వర సన్నిధిలో నవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం సీతారాముల కల్యాణ ఘట్టాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆంతరంగికంగా నిర్వహించారు.