పూడూరు, ఏప్రిల్ 22 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ స్వచ్ఛభారత్పై అవగాహన కల్పించాలని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేశ్బాబు ప్రజాప్రతినిధులకు సూచించారు. గురువారం పూడూరు మండల కేంద్రంలోని డంపింగ్ యార్డును సందర్శించి తడి, పొడిచెత్తను వేరు చేసే విధానంపై కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ పి.నవ్యరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ వార్డు సభ్యులకు, కార్మికులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వీధులు, రోడ్లు, మురుగు కాల్వలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుందన్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. వీరితో పాటు డీపీవో రిజ్వాన, డీఎల్పీవో అనిత, ఎంపీడీవో ఉష, ఉప సర్పంచ్ టీ రాజేందర్, వార్డు సభ్యుడు జంగయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, అనంతరాములు, దర్శన్ తదితరులు ఉన్నారు.
దోమ మండల కేంద్రంలో..
దోమ, ఏప్రిల్ 22 : ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్త సేకరణకు అన్ని స్థాయిల సిబ్బందితో ప్రణాళిక తయారు చేసుకోవాలని రాష్ట్ర స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ సురేష్బాబు అన్నారు. గురువారం దోమ మండల కేంద్రంలోని కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఇండ్లకు ఒక ఉద్యోగిని సూపర్వైజర్గా నియమించుకొని చెత్తను సేకరించాలన్నారు. పంచాయతీ సిబ్బందితో పాటు మహిళా సంఘాలు, వ్యవసాయ శాఖ ఏఈవోల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, జిల్లా పంచాయతీ డివిజన్ అధికారి అనిత, స్వచ్ఛభారత్ జిల్లా డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.