ఈ ప్రాంత ప్రజలకు నెలలో రెండుసార్లు కూడా నీళ్లు రావడం లేదు. ఇక రోజు విడిచి రోజు రక్షిత తాగునీరు అందిస్తానని హామీ ఇస్తున్న. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను మీరు తీసుకోండి. నగర శివారు ప్రాంత ప్రజలకు హైదరాబాద్ మహా నగరంలో ఇచ్చినట్టుగానే రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేసే బాధ్యత నేను తీసుకుంటా.” అని గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి నీటి సరఫరా చేస్తూ శివారు ప్రాంత ప్రజల గొంతు తడుపుతున్నారు.
శివారు ప్రాంత ప్రజలకు మహర్దశ పట్టింది. ఎన్నో ఏండ్ల నీటి కష్టానికి చెల్లుచీటి పడింది. హైదరాబాద్ నగరంలో రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నట్టుగానే ఇక నుంచి ఔటర్ సమీపంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాలకు జల మండలి రోజు విడిచి రోజు రక్షిత తాగునీరును సరఫరా చేయనున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీర్ ఆదేశాల మేరకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేయడంతో పాటు అదనంగా మరో 50ఎంఎల్డీల నీటిని శివారు ప్రాంతాలకు జలమండలి కేటాయించిం ది. ఈ అంశంపై జలమండలి ఎండీ దాన కిశోర్ అధికారులతో పాటు శివారు ప్రాంత మేనేజర్లతో జలమండలి ప్రధాన కార్యాలయంలో గురువారం విస్తృతస్థా యి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జలమండలి ఎండీ దాన కిశోర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఆవల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు సరఫరా చేస్తున్న నీటితో పాటు అదనంగా మరో 50 ఎంఎల్డీల నీటిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఏడు కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 17 పంచాయతీల పరిధిలోని సుమారు 193 హాబిటేషన్లలో రోజు విడిచి రోజు, మరికొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి ఐదు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయనున్నారు. శుక్రవారం నుంచి నీటి సరఫరాను ప్రారంభిస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా సక్రమంగా జరిగేలా ఆయా ప్రాంతాల్లో కొత్త పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని.. మరికొన్ని ప్రాంతాల్లో ఫీడర్ మెయిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.