అది.. నాలుగు అంతస్తుల బంగ్లా . దాని ఖరీదు సుమారు రూ.1.5కోట్ల వరకు ఉంటుంది. ఆ ఇంటికి అద్దె రూపంలో ప్రతినెలా సుమారు రూ.30వేల పైనే వస్తుంది. రూ.కోట్ల ఖరీదైనా బంగ్లాను నిర్మించుకుని, దాని ద్వారా ప్రతినెలా రూ.వేలల్లో అద్దె వస్తున్నా.. నిబంధనల ప్రకారం జలమండలి నుంచి అధికారికంగా ఓ నల్లా కనెక్షన్ను తీసుకోలేకపోయాడు. కానీ.. అక్రమంగా ఆ ఇంటిలోని అన్ని పోర్షన్లకు పుష్కలంగా నీరు సరిపోయేలా సుమారు 15 ఎంఎం సైజుగల పైపుతో నల్లాను ఏర్పాటు చేసుకున్నాడు. అతనే ఇంటి యజమాని సతీశ్. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాలానగర్, సాయినగర్లోని ప్లాట్ నంబర్ 158, 159లలో భారీ భవనం నిర్మించాడు. గతంలో ఓ నల్లా కనెక్షన్ తీసుకున్న సతీశ్.. కొద్ది రోజులకు మరో నల్లాను అక్రమంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా అక్రమ నల్లాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో ఎత్తు ప్రాంతంలో ఉన్న వారికి, చుట్టుపక్కల ఇండ్లకు సక్రమంగా నీరు అందని పరిస్థితి వచ్చింది.
ఈ క్రమంలోనే సతీశ్ అక్రమ నల్లా కనెక్షన్ భాగోతంపై కొందరు జలమండలి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వారు ఆకస్మీక తనిఖీలు నిర్వహించి.. సతీశ్పై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అక్రమ నల్లాలను ఏర్పాటు చేసుకున్నా.. డొమెస్టిక్ అనుమతులు పొంది.. కమర్షియల్గా వినియోగిస్తున్న వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్: 9989998100, 9989992268 లకు అందించాలని..సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జలమండలి విజిలెన్స్ అధికారులు తెలిపారు.