జలమండలి మరో కీలకమైన తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ దాహర్తిలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాల తరలింపులో శాశ్వత పరిష్కారంగా 1450కోట్లతో సుంకిశాల ప్రాజెక్టును చేపడుతున్నది. రాబోయే రోజుల్లో కృష్ణా జలాలకు ఎంత డిమాండ్ పెరిగినా చీకూ చింత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ప్రా జెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బడ్జెట్లో 725కోట్ల నిధులను ప్రాజెక్టుకు కేటాయించింది. దీంతో జలమండలి అధికారులు మంగళవారం 1167 కోట్లు సివిల్ పనులకు టెండర్లను ఆహ్వానించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు టెం డర్ తుది గడువు విధించారు. వచ్చే నెలాఖరులో పనులు ప్రారంభించి, ఏడాదిన్నర వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.
సుంకిశాల వైపు అడుగులు ఇలా…
నగరానికి కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటి తరలింపునకు ప్రస్తుతం నాగార్జున సాగర్కు సమీపంలో భారీ నీటిపారుదల శాఖ నిర్వహిస్తున్న పుట్టంగండి పంప్హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు.
వేసవిలో నాగార్జునసాగర్లో నీటి మట్టాలు 510 అడుగుల దిగువనకు చేరినప్పుడు అత్యవసర పంపింగ్ ద్వారా కోదండాపూర్ నీటిశుద్ధి కేంద్రానికి కృష్ణా జలాలను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో ప్రతి వేసవిలో సాగర్ బ్యాక్ వాటర్ వద్ద డ్రెడ్జింగ్ ప్రక్రియను చేపట్టి భారీ మోటార్లతో పంపింగ్ చేయాల్సి వస్తుంది. ఇందుకు యేటా రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా మూడు దశల నీటిని అత్యంత లోతు నుంచి కూడా సులువుగా తోడేందుకు భారీ జాక్వెల్స్ నిర్మాణం చేసుకోవాలని నీటిపారుదల శాఖ జలమండలికి సూచించింది. దీంతో ముంబై కంపెనీకి చెందిన టాటా కన్సల్టెన్సీ బృందాన్ని జలమండలి రంగంలోకి దించింది. ఈ బృందం సుంకిశాల పథకం పూర్తి చేసేందుకు 1450కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. దీంతో తాజాగా ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో 725కోట్ల నిధులను ఈ ప్రాజెక్టుకు కేటాయించింది.
రూ.1450 కోట్లతో పనులు
సుంకిశాల తాగునీటి ప్రాజెక్టును 1450 కోట్లతో చేపడుతున్నారు. ఇందులో 1167 కోట్లు సివిల్ పనులకు కేటాయించగా… ఎలక్ట్రికల్ పనులకు 274 కోట్లు ఖర్చు చేయనున్నారు. 1167.94 కోట్లతో అండర్ గ్రౌండ్ షాప్ట్, ఇన్టేక్ టన్నెల్, పంప్హౌస్ సూపర్ స్ట్రక్చర్, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్, సుంకిశాల నుంచి కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రం వరకు భారీ పైపులైన్ ఏర్పాటుకు ఈ నిధులను వెచ్చించనున్నారు.