సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో మహిళల అభ్యున్నతి కోసం ఏర్పడిన వేదిక ఇప్పుడు కరోనా ఆపత్కాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నది. రెండు పూటలా కడుపు నిండా అన్నం పెడుతూ అమ్మలా ధైర్యాన్నిస్తున్నది.. శ్రీ వైష్ణవ మహిళా ఐక్య వేదిక. ప్రతి రోజు 300 మందికి భోజనం పెడుతూ తామున్నామంటూ భరోసానిస్తున్నారు ఈ వేదిక మహిళామణులు. వైద్యులు, సైకాలజిస్టులు, అడ్వకేట్స్ ఇలా అన్ని రంగాల మహిళలు ఈ గ్రూపులో ఉండి కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు. కాల్ చేస్తే చాలు ఇంటికి భోజనం పంపిస్తున్నారు. ఇంట్లోనే వంటలు తయారు చేసి వాటిని అవసరమున్న వారికి అందజేస్తున్నారు. అంతే కాదు నిత్యావసర సరుకులు అందజేయడం, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. కొవిడ్తో బాధపడుతున్న నిరుపేదల వైద్యానికి కూడా వారి సహాయం ఉంటుంది. ఇలా.. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ఫౌండర్ శ్వేత ఆలోచన నుంచి వచ్చిన ఈ వేదిక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతుంది. 90328 12279, 85238 71246, 88851 8800, 96426 6335 నెంబర్లకు ఫోన్ చేసి చిరునామా చెబితే చాలు హైదరాబాద్ వైష్ణవ వారియర్స్ ఆహారాన్ని ఇంటికి చేరుస్తారు.
ఫోన్ చేసి ఆకలి అవుతుందని చెబుతుంటే చాలా బాధగా ఉంటుంది. కొవిడ్తో బాధపడుతున్న వారే అధికంగా ఫోన్ చేస్తున్నారు. ఇంట్లో వంట చేసుకునే వెసులుబాటు లేదని చెబుతున్నారు. అలాంటి వారికి కొవిడ్ నుంచి కోల్కొనే వరకు ఆహారాన్ని అందిస్తున్నాం. కొవిడ్ సోకి కుటుంబమంతా బాధపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వారికి ఆహారాన్ని అందిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వైష్ణవ మహిళా వేదిక ఎప్పుడూ సాయం చేయడంలో ముందు ఉంటుంది. – హరిత, హైదరాబాద్ వైష్ణవ వారియర్
ప్రతి ఒక్కరిని కరోనా వైరస్ వెంటాడుతుంది. భయంభయంగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దైర్యంగా ఉండాలి. తోచిన సాయం అందిస్తూ బాధితులకు భరోసానివ్వాలి. మా తరపున నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, పాలు, కిరాణ సామగ్రి తదితరులన్నీ సమకూర్చుతున్నాం. అంతేకాదు కొవిడ్తో బాధపడుతూ చికిత్స తీసుకునే స్థోమత లేని వారికి మా వేదిక తరపున ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాం.- రమణి, హైదరాబాద్ వైష్ణవ వారియర్
కరోనా వంటి అతి ప్రమాదకరమైన పరిస్థితులను తట్టుకుని నిలబడే ధైర్యం కావాలి. అందరూ ఒకరికి ఒకరూ అండగా నిలిస్తేనే అది సాధ్యమవుతుంది. ఒక్క ఫోన్ చేస్తే గంటలో అవసరమైన సరుకులు, ఆహారాన్ని ఇంటికి చేరుస్తాం. పప్పు, రోటీ, అన్నం, పండ్లు, డ్రైఫ్రూట్స్, సద్దన్నం తదితర పోషకాహారం అందిస్తాం. నగరంలో ఎక్కడి నుంచి అయినా సరే కాల్ చేయొచ్చు. కొవిడ్ పరిస్థితుల కారణంగా ఇంట్లో వండుకోలేని వారికి మేమే మా ఇంట్లో స్వయంగా వంట తయారు చేసి కావాల్సిన ఆహారాన్ని అందిస్తాం. – ప్రశాంతి, హైదరాబాద్ వైష్ణవ వారియర్స్
వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ సమయం ఏర్పాటు చేసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. సాయం అందించే మనుషులు ఇప్పుడు సమాజానికి కావాలి. వృత్తిలో భాగంగా ప్రస్తుతం కొవిడ్ బాధితుల కష్టాలను ప్రత్యక్షంగా చూస్తున్నాను. బాధితుల కుటుంబాలకు మనోధైర్యం కల్పించడానికి టెలీ కన్సల్టేషన్ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. వైష్ణవ వేదిక ద్వారా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అవసరమున్న వారెవ్వరైనా మాకు ఫోన్ చేస్తే సరిపోతుంది. సాయం అందిస్తాం. – డాక్టర్ మానస, హైదరాబాద్ వైష్ణవ వారియర్