ఉస్మానియా యూనివర్సిటీలోని వెలోడ్రమ్ (సైక్లింగ్) స్టేడియంలో జరుగుతున్న 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ – 2021 పోటీలు కొనసాగుతున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్), సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సోమవారం పాల్గొన్న ఇద్దరు సైక్లిస్ట్లు ఖేలో ఇండియా కార్యక్రమానికి ఎంపికయ్యారు. సైక్లింగ్ రైడర్స్ అండర్-14 విభాగంలో ఎంపికైన ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరూ పోటీల్లో తెలంగాణ తరపున పాల్గొన్నారు. సీనియర్ కోచ్ దిలీప్, కోచ్ అల్లాడి కృష్ణ యాదవ్ పర్యవేక్షణలో సిద్ధమైన ఈ ఇద్దరి ప్రతిభ చూసిన నిర్వాహకులు వారిని ఖేలో ఇండియాకు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద వారికి కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యుత్తమమైన శిక్షణ అందించడంతో పాటు, వారికి స్కాలర్షిప్స్ సైతం అందజేయనున్నారు.