రోడ్డు ప్రమాదాలలో ఫిబ్రవరి నెల హైద్రాబాద్ పోలీసులను టెన్షన్కు గురిచేసింది. అయితే, వెంటనే తేరుకున్న పోలీసులు మార్చి నెలలో రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడంలో విజయవంతమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాల మరణాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాల మరణాలలో అతి వేగమే ప్రధాన కారణమైంది. అతి వేగం వద్దంటూ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంత మంది వాహనదారులలో మార్పు రావడం లేదు. మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పక్కాగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు అవకాశం ఉండదు. ఈ విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తించుకుంటే ప్రమాదాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు అవకాశముంటుంది.
అయితే, రోడ్డు ప్రమాదాలలో మృతి చెందుతున్న వారిలో ఎక్కువగా వాహనం నడిపే వారి నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నట్లు ఆయా ఘటనలు సాక్ష్యాలుగా మిగిలాయి. నగరంలో జనవరి మాసంలో 13 ఘటనలలో 15 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 11 మంది అతి వేగం కారణంగానే ప్రమాదానికి గురయ్యారని పోలీసుల విశ్లేషణలో తేలింది. ఫిబ్రవరి నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 35 మంది మృతి చెందారు. ఇందులో 15 ఘటనల వరకు అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్తో జరిగిన ఘటనలే ఉన్నాయి. మార్చి నెల 28వ తేదీ వరకు రోడ్డు ప్రమాదాలలో 14 మంది మృతి చెందగా, అందులో ఎనిమిది ఘటనలలో అతి వేగం నిర్లక్ష్యంతో జరిగినవే ఉన్నాయి.
ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉన్నా.. ప్రమాదాలలో 35 మంది మృత్యువాత పడటంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ రోడ్లను ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యేటేటా రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గిస్తూ వస్తున్నారు. 2019లో 271 మంది మృతి చెందగా, 2020లో 254కు తగ్గించారు. ఈ ఏడాది ఈ సంఖ్యను రెండు వందల కంటే కిందకు తేవాల నే లక్ష్యంతో ఉన్నారు. అయితే, అనుకోకుండా ఫిబ్రవరిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. మూడేండ్లలో మొదటి మూడు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య ఇలా ఉంది.
వాహనదారులు తప్పని సరిగ్గా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ నగర వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్నారు. రూల్స్ పాటించని వారిపై కాంట్రాక్టు, నాన్ కాంట్రాక్టు పద్ధతిలో జరిమానాలు కూడా విధిస్తున్నారు. హైదరాబాద్ రోడ్లను ప్రమాద రహిత రోడ్లుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయినా, కొంతమంది వాహనదారులలో మార్పు రాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని ఘటనలలో హెల్మెట్తో ఉన్న వాహనదారుడు ప్రాణాలతో బయటపడుతుండగా, వెనుక కూర్చున్న వారు హెల్మెట్ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలలో మృతి చెందుతున్నారు. నిర్లక్ష్యంతో వాహనాలు నడుపుతుండటంతో రెప్పపాటులో ప్రాణాలు కోల్పొతున్న వారున్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించి, వేగాన్ని తగ్గిస్తే ప్రమాదాలను మరింతగా తగ్గించేందుకు అవకాశముంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.