హైదరాబాద్ : తాను తినడానికి తెచ్చుకున్న భోజనాన్ని ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు వడ్డించి వారి కడుపు నింపిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చర్య సర్వత్రా ప్రశంసలందుకుంటుంది. సిరుపాంగి మహేశ్కుమార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ నగరంలోని సోమాజిగూడలో సోమవారం రాత్రి ఎప్పటిలాగే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు పిల్లలు రాత్రి 11 గంటలకు రోడ్డు పక్కన అహారం కోసం యాచించడం చూశాడు. ఏ ఒక్కరూ వారికి సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో చలించిపోయిన కానిస్టేబుల్ తాను తినడానికి తెచ్చుకున్న భోజనాన్ని ఆ చిన్నారులకు వడ్డించి కడుపు నింపాడు.
ఈ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. కానిస్టేబుల్ చర్యను మెచ్చుకుంటూ నెటిజన్లు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్నప్పుడూ అంతకుక్రితం కూడా ఈ పిల్లల్ని చూసినట్లు వారి తండ్రి రోడ్లవెంట బిచ్చమెత్తుకుంటాడని మహేశ్కుమార్ తెలిపాడు. లాక్డౌన్ కారణంగా పిల్లలు తినేందుకు ఆహారం దొరకక, కొనేందుకు ఏ వస్తువులు అందుబాటులో లేక గంటలపాట ఆకలితో అలమటించినట్లు తెలిపారు. తాను ఆహారం అందించినప్పుడూ వారి ముఖాల్లో విరబూసిన చిరునవ్వులకు విలువ కట్టలేమని పేర్కొన్నాడు.