హైదరాబాద్ అంటే ట్రాఫిక్ నరకం.. గంటల తరబడి ప్రయాణం.. చౌరస్తాల వద్ద బారులు..గమ్యం చేరేదెప్పుడో తెల్వదు..అత్యవసరమయితే అంతే సంగతి. ఇదంతా గతం. మహానగరాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం’ (ఎస్ఆర్డీపీ) కింద నగరవ్యాప్తంగా ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మిస్తున్నది. సుమారు రూ.1010 కోట్ల వ్యయంతో 20 ప్రాజెక్టులకుగాను..18 చోట్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఏండ్ల తరబడి జటిలంగా ఉన్న ట్రాఫిక్ సమస్య..ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో శాశ్వతంగా పరిష్కారమైంది. ఇవే కాకుండా ఇరుకుగా మారిన రైలు వంతెనల కింద రోడ్లను విస్తరించడంతోపాటు రైల్ ఓవర్ బ్రిడ్జి, రైల్ అండర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తేవడంతో ప్రయాణం సులభమైంది. పూర్తయిన ఫ్లైఓవర్లు,అండర్పాస్లపై నగరవాసులు సాఫీగా సాగుతుండగా,
విలువైన సమయం, ఇంధనం ఆదా అయ్యిందని ఆనందపడుతు న్నారు.
నగర రహదారులు అంటేనే అడుగడుగునా ట్రాఫిక్ చిక్కులే. సిగ్నల్ పడిందంటే చాలు.. నిమిషాల పాటు ఆగాల్సిందే. చివరకు అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్ వెళ్లాలన్నా.. అన్నీ అడ్డంకులే. శరవేగంగా విస్తరిస్తున్న మహానగరంలో రోడ్లపై రోజు రోజుకు రద్దీ విపరీతంగా పెరిగిపోతుండటంతో వాహనదారులు ముందుకు సాగాలంటే ఆగి ఆగి వెళ్లాల్సిన పరిస్థితులు. ఇలాంటి కష్టాలకు ముగింపు పలికేలా తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా, విశ్వనగరంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ) కింద 20కి పైగా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, రైల్ ఓవర్ బ్రిడ్జి, రైల్ అండర్ బ్రిడ్జిల నిర్మాణాలను శరవేగంగా చేపట్టింది. 18 ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ పనులన్నీ పూర్తయి దశల వారీగా అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం సుమారు రూ.1010.7 కోట్లు ఖర్చు చేశారు. గతంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇప్పుడు ఎలాంటి రందీ లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది. ఎంతో విలువైన సమయం ఆదా కావడంతో పాటు ఇంధన వినియోగమూ గణనీయంగా తగ్గుతున్నది. జల్దీ..జర్నీతో నగరవాసులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గమ్యస్థానాలకు త్వరగా చేరుకుంటున్నామని, ఆర్థికంగా కూడా ఊరట కలుగుతున్నదని చెబుతున్నారు.